నిర్లక్ష్యమా..మూర్ఖత్వమా: నోటికి ఏదొస్తే అది మాట్లాడ్డమే!

మొన్నటివరకు బాలకృష్ణ ఏదైనా మాట్లాడితే అది కామెడీగా ఉండేది. ఆయన వ్యాఖ్యల్ని మెజారిటీ జనాలు కామెడీగా తీసుకునేవారు. “ఆయనంతే, వదిలేయండి” అనేది చాలామంది కామన్ ఫీలింగ్. కానీ ఇప్పుడా మాటతీరు శృతిమించుతోంది. అతి కాస్తా,…

మొన్నటివరకు బాలకృష్ణ ఏదైనా మాట్లాడితే అది కామెడీగా ఉండేది. ఆయన వ్యాఖ్యల్ని మెజారిటీ జనాలు కామెడీగా తీసుకునేవారు. “ఆయనంతే, వదిలేయండి” అనేది చాలామంది కామన్ ఫీలింగ్. కానీ ఇప్పుడా మాటతీరు శృతిమించుతోంది. అతి కాస్తా, వెగటుగా మారుతోంది. జనాల సహనం నశించే స్థాయికి చేరుకున్నాయి బాలయ్య మాటలు.

రాత్రి తన సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ మాట్లాడిన మాటలు విని అంతా అవాక్కవుతున్నారు. ఆయన వ్యాఖ్యల్లో చిన్నపెద్దా తేడా లేదు. ఆయన మాటల్లో ఎలాంటి గౌరవ సూచకాల్లేవు. ఆయన ప్రసంగంలో ఏమాత్రం హుందాతనం కనిపించలేదు.

ఏది పడితే అది మాట్లాడే బాలయ్య, రాత్రి కూడా అలానే తన ప్రసంగం ప్రారంభించారు. ప్రతిసారి చేసినట్టుగానే ఈసారి కూడా తన నాన్నగారి ప్రస్తావన తీసుకొచ్చారు, తండ్రిని పొగిడారు. అందులో తప్పులేదు. అయితే తన తండ్రిని పొగిడే క్రమంలో “అక్కినేని-తొక్కనేని” అంటూ ఆయన కామెంట్ చేయడం తీవ్ర అభ్యంతరకరం.

అక్కడితో ఆగలేదు బాలయ్య లూజ్ టంగ్ వ్యవహారం. తన నైజాం కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఎవ్వర్ని పలకరించినా హిందీ లేదా ఉర్దూతో ప్రారంభించేవాళ్లమంటూ.. ఆసువుగా రెండు బూతు పదాలు అందుకున్నారు. తన దృష్టిలో హిందీ లేదా ఉర్దూ అంటే ఆ బూతులు మాత్రమే అనేది బాలయ్య ఫీలింగ్ లా ఉంది.

“అమ్మాయి కనిపిస్తే కమిట్ అవ్వాలి, కడుపు చేయాలి” అంటూ గతంలో నిండు సభలో మైక్ పట్టుకొని మాట్లాడిన బాలయ్య నుంచి సంస్కారవంతమైన స్టేట్ మెంట్లు ఆశించడం అత్యాశే అవుతుంది కానీ, ఈసారి ఆయన మరింత దిగజారి మాట్లాడ్డం బాధాకరం.

హీరోయిన్ శృతిహాసన్ ను రాక్షసి అంటూ ఆయన గతంలోనే సంభోదించారు. ఏదో సరదాకి ఒకసారి అంటే అయిపోయేది. ఇప్పటికే బాలీవుడ్ మీడియా ఈ విషయంలో శృతిహాసన్ పై ఇష్టమొచ్చినట్టు రాసేసింది. అది తెలిసి కూడా రాత్రి మళ్లీ అదే మాట రిపీట్ చేశారు బాలయ్య.

అక్కడితో ఆగకుండా ఒంగోలు ప్రస్తావన తీసుకొచ్చారు. ఒంగోలు జనాల్ని ఒంగోలియన్ అంటూ వెటకారంతో కూడిన ఓ పదప్రయోగం చేశారు. మంగోలియా జాతి, ఒంగోలు జనాలు ఒకటే అనేది ఆయన ఉద్దేశం కాబోలు.

ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రి బాలయ్య స్పీచ్ లో అడుగడుగునా బూతులు, వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్లక్ష్యంతో కూడుకున్న స్టేట్ మెంట్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తోంది. బాలకృష్ణకు గతంలో ఇచ్చిన మెంటల్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ ను మరోసారి పునరుద్ధరించాలంటూ కామెంట్స్ పడుతున్నాయి. తమ జాతి పరువు తీసేలా బాలకృష్ణ మాట్లాడుతున్నారంటూ ఆ కులం జనాలు బాధపడుతున్నారు.