రామోజీరావు నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రిక చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం తెగ ఉత్సాహం ప్రదర్శిస్తోంది. తన కుమారుడు ఇంకా ప్రయోజకుడు కాలేదనే బాబు బాధను పోగొట్టేందుకు రామోజీ శ్రమటోడుస్తున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ను పులిగా చిత్రీకరించేందుకు “ఈనాడు” తాపత్రయ పడడాన్ని గమనించొచ్చు. చివరికి లోకేశ్ పల్లకీ మోయాల్సిన దుస్థితి రామోజీరావుకు వచ్చిందనే సంకేతాల్ని తాజా ఈనాడు కార్టూన్ పంపిందనే చర్చకు తెరలేచింది.
ఇవాళ్టి ఈనాడు కార్టూన్ రామోజీరావు దయనీయస్థితిని ప్రతిబింబిస్తోంది. బాబుకు రామోజీ ఓదార్పు ఇవ్వడం సరే, మీడియా దిగ్గజం అని పిలిపించుకున్న పెద్దాయన…ఇప్పుడు లోకేశ్ను కూడా భుజానెత్తుకుని ఊరేగడమా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2,800 కిలోమీటర్లు పైగా నడక సాగించారు. మధ్యలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల నడకదారి భక్తులకు చిరుతల నుంచి రక్షణ కోసం టీటీడీ కర్రలు పంపిణీ చేయడాన్ని లోకేశ్ పాదయాత్రకు లింక్ పెట్టి ఈనాడులో కార్టూన్ను వేశారు.
“తిరుమల భక్తులు కాదు సార్… మనవాళ్లే. లోకేశ్ పాదయాత్రను నిలువరించడానికి కావాలట!” అంటూ తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సొంత పార్టీ నాయకుడు చెబుతున్నట్టుగా కార్టూన్ వేశారు. అలిపిరి పాదాల మండపం వద్ద బుధవారం నడకదారి భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కర్రలు పంపిణీ చేశారు. ఈనాడు పత్రిక దృష్టిలో లోకేశ్ పులిలా పాదయాత్ర చేస్తుంటే, వైసీపీ కేడర్ అడ్డుకుంటోంది.
తిరుమల నడక దారిలో చిరుత పులుల్ని నిలువరించేందుకు ఏ విధంగా అయితే కర్రలు ఇస్తున్నారో, లోకేశ్ అనే టీడీపీ టైగర్ను కూడా అడ్డుకునేందుకు కర్రలు ఇవ్వాలని వ్యంగ్యాన్ని జోడించి కార్టూన్ వేయడాన్ని గమనించొచ్చు. చివరికి చంద్రబాబే కాదు, ఆయన కుమారుడు లోకేశ్ను కూడా భుజాన మోయాల్సిన దుస్థితి రామోజీరావుకు దాపురించిందనే కామెంట్స్ వస్తున్నాయి. అంతా మార్గదర్శి అక్రమాల పుణ్యమా అని రామోజీరావుకు జీవిత చరమాంకంలో ఎవరికీ రాకూడని కష్టాలే వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.