మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డితో పాటు మరో నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాళ్లిద్దరికి బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడం గమనార్హం. దీంతో కడప ఎంపీ అవినాష్రెడ్డి తండ్రితో పాటు మరొకరికి చుక్కెదురు అయినట్టైంది.
వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం మొదట సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ వాళ్లకు నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో హైకోర్టును వారు ఆశ్రయించారు.
బెయిల్ పిటిషన్పై సీబీఐ, భాస్కర్రెడ్డి, ఉదయ్ తరపు న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ తరపు న్యాయవాదుల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పలుకుబడి కలిగిన భాస్కర్రెడ్డికి, అలాగే మరొకరికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారనే వాదనతో ఏకీభవించిన హైకోర్టు… నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెయిల్ కోసం నిరంతర పోరాటం చేయక తప్పదు.