గ్రాఫిక్స్ రాజధాని, పేపర్ కంపెనీలు.. ఇక వద్దు

“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం ర్యాంకు పడిపోయింది.. మేమున్నప్పుడు నెంబర్ 1గా ఉండే రాష్ట్రం.. ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది”. ఇదీ పచ్చబ్యాచ్ చేస్తున్న ప్రచారం. ర్యాంకులొద్దు, రాష్ట్రానికి మేలు జరిగితే చాలు…

“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం ర్యాంకు పడిపోయింది.. మేమున్నప్పుడు నెంబర్ 1గా ఉండే రాష్ట్రం.. ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది”. ఇదీ పచ్చబ్యాచ్ చేస్తున్న ప్రచారం. ర్యాంకులొద్దు, రాష్ట్రానికి మేలు జరిగితే చాలు అని సీఎం స్థిర నిర్ణయం తీసుకోబట్టే ఈ ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకూ టీడీపీ ప్రభుత్వం బయటి కంపెనీలతో కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ బోగస్ అనే అంటున్నారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

కేవలం పేపర్ వర్క్ మాత్రమే జరిగింది, వేల కోట్ల పెట్టుబడులు, వందల్లో ఉద్యోగాలు, అభివృద్ధి బాటలో గ్రామాలు అంటూ టీడీపీ ప్రజల్ని భ్రమల్లోకి నెట్టింది. వైసీపీ వచ్చాక చూస్తే అంతా శూన్యం. అమరావతి ఎలా గ్రాఫిక్స్ రాజధాని అయిందో.. కంపెనీలు అలా పేపర్ పై మాత్రమే కనిపించాయి. ప్రభుత్వం కేటాయించిన భూములన్నీ వివాదాల మయంగా మారాయి. ఎంవోయూలు కుదుర్చుకున్న వందలాది కంపెనీల్లో ఒకటి రెండు తప్ప మిగతావి పని మొదలు పెట్టలేదు.

జగన్ ప్రభుత్వం ఈ సిస్టమ్ మొత్తాన్ని మార్చింది. ఏదైనా కంపెనీ ప్రభుత్వ అనుమతి కోసం వస్తే ముందు ఎంవోయూ కాదు, పని ఎప్పుడు మొదలు పెడతారని ప్రశ్నిస్తోంది. పేపర్ వర్క్ కాదు, గ్రౌండ్ వర్క్ చూపించండి అంటూ కండిషన్ పెడుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని, అందుకే డొల్ల కంపెనీలు వెనకడుగేస్తున్నాయని అన్నారు మంత్రి మేకపాటి. 

“మనకు ర్యాంకులతో సంబంధం లేదు. ఒకేసారి మొత్తం అభివృద్ధి జరగాలని, కంపెనీలన్నీ ఒకే ఏడాది వచ్చేయాలని తాను అనుకోవట్లేదని, ఏడాదికేడాది పారిశ్రామికరంగంలో ఎంతోకొంత అభివృద్ధి జరగాలని, ఆ అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడాల”నేది జగన్ ఆలోచనగా ఉందట. కేంద్రం ప్రకటించే ర్యాంకుల్లో రాష్ట్రం వెనకపడ్డా.. స్థిరమైన అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దడానికే జగన్ కి ఈ ఐదేళ్లు సరిపోయేలా ఉంది. తమ అసమర్థతని, తుగ్లక్ నిర్ణయాలను కప్పిపుచ్చి, ఇప్పుడేదో తప్పులు జరిగిపోతున్నాయంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ తాను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం ఒక్కటే భవిష్యత్ పై ఆశలు రేపే అంశం.