నడిరోడ్డుపై పట్టపగలు యాసిడ్ దాడి

ఢిల్లీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ దుర్మార్గుడు, అమ్మాయిపై యాసిడ్ తో దాడి చేశాడు. కొన ప్రాణాలతో విలవిల్లాడుతున్న ఆ యువతిని స్థానికులు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. వెస్ట్…

ఢిల్లీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ దుర్మార్గుడు, అమ్మాయిపై యాసిడ్ తో దాడి చేశాడు. కొన ప్రాణాలతో విలవిల్లాడుతున్న ఆ యువతిని స్థానికులు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. వెస్ట్ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఈరోజు ఉదయం జరిగింది ఈ ఘటన.

మోహన్ గార్డెన్ ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయి, తన చెల్లెలితో కలిసి రోడ్డు పక్కన నిల్చొంది. అదే టైమ్ లో అటువైపు వేగంగా ఓ బైక్ దూసుకొచ్చింది. బైక్ వెనక కూర్చున్న వ్యక్తి తన కోటు నుంచి ఓ సీసా బయటకు తీశాడు. అందులో యాసిడ్ ఉంది.

అమ్మాయి దగ్గరకు రాగానే బైక్ స్లో అవ్వడం, వెనక ఉన్న అగంతకుడు సీసాలో ఉన్న యాసిడ్ ను యువతి మొహంపై చల్లడం చకచకా జరిగిపోయాయి. ఒక్క క్షణం పాటు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో చుట్టుపక్కల జనం ఉండిపోయారు. అంతలోనే హాహాకారాలు చేస్తూ యువతి కిందపడిపోయింది.

వెంటనే తేరుకున్న స్థానికులు, యువతిని దగ్గర్లో ఉన్న సఫ్దర్ జంగ్ హాస్పిటల్ లో చేర్చారు. యువతి కళ్లలో యాసిడ్ పడింది. ముఖంపై కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

యువతి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. జరిగిన ఘటనపై ఉత్తమ్ నగర్ అట్టుడికిపోయింది. బాధిత బాలికకు న్యాయం చేయాలని, దుండగుల్ని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు రాస్తారోకో చేశారు.