ఏపీ హైకోర్టుకు సంబంధించి ఇద్దరు జడ్జిల బదిలీలపై తెలుగుదేశం పార్టీ ఒక రేంజ్ లో బాధపడుతూ ఉంది. కొలీజియం నిర్ణయం ప్రకారం.. ఏపీ హై కోర్టు నుంచి ఇద్దరు జడ్జిలు బదిలీ అయ్యారు. వారే జస్టిస్ బట్టు దేవానందం, జస్టిస్ రమేష్. వీరి బదిలీలపై తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఏకంగా ఏపీ హైకోర్టు ఆవరణలో నిరసనకే దిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు!
జడ్జిలు ఇలాంటి ప్రేమాపేక్షలకు అతీతులు అని అంతా నమ్ముతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఆ పార్టీ సానుభూతి పరులు ఇంతగా ఎందుకు గింజుకుంటున్నారో అస్సలు అర్థం కాదు. ఇద్దరు జడ్జిలు బదిలీలపై వారు తీవ్రంగా స్పందిస్తున్న తీరు, కొలీజియంకు ఉద్దేశాలను ఆపాదించడం, ఈ వ్యవహారంలోకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును కూడా లాగడం గమనార్హం!
ఈ బదిలీలకు ముఖ్యమంత్రి, ఆయన కులం కారణం అనేంత రేంజ్ లో తెలుగుదేశం పార్టీ తరఫు లాయర్లు రచ్చ చేశారు. అంతే కాదు.. ఏపీ హైకోర్టుకు సంబంధించి లాయర్ల సంఘం నుంచి ఏవేవో తీర్మానాలు కూడా ప్రవేశ పెట్టి జడ్జిల బదిలీలను ఖండించారట!
అయితే ఈ తీర్మానాలు చెల్లవంటూ లాయర్ల సంఘం మరో ప్రెస్ నోట్ ఇచ్చింది. అయినా.. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్న వాళ్లు ఇలాంటి నిరసనలు చేయవచ్చా? జడ్జిల బదిలీలకు రాజకీయాలను ఆపాదించవచ్చా? ఇది వరకూ జడ్జిలకు వివిధ రకాల ఉద్దేశాలను ఆపాదించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొందరిపై సీబీఐ విచారణకే ఆదేశించింది న్యాయస్థానం. మరి అది తప్పు అయినప్పుడు.. ఇలా జడ్జిల బదిలీలపై నిరసనలకు దిగడం, వాటికి రాజకీయాలను ఆపాదించడం న్యాయవ్యవస్థకు గౌరవాన్ని ఇవ్వడం అవుతుందా?
తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్, ఆ పార్టీ అభిమాన లాయర్లు ఇలాంటి పనులకు దిగవచ్చా! బడ్జిల బదిలీలపై ఇలాంటి డైరెక్టు నిరసనలు నిస్సందేహంగా న్యాయవ్యవస్థను అవమానపరిచేవే! అయితే న్యాయవ్యవస్థ వారి దగ్గర బంధువు కాబోలు. ఆ విషయంలో వారు ఎలాగైనా స్పందించే హక్కును కలిగి ఉన్నట్టున్నారింకా!