చంద్రబాబునాయుడు జోకులేస్తున్నారు. కేఏ పాల్, సోము వీర్రాజు, పవన్కల్యాణ్ సరసన ఆయన చేరడానికి ఉబలాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయ చరమాంకంలో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థమవుతున్నట్టు లేదు. ఏదేదో ఊహించుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో తనకేమవుతుందోననే భయాన్ని బయట పెట్టుకున్నారు. భవిష్యత్పై భరోసా లేకపోవడం వల్లే చంద్రబాబులో వింత ప్రవర్తన చూడాల్సి వస్తోందని మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతాంగ సదస్సులో చంద్రబాబు ప్రసంగం భలే కామెడీని తలపించింది. ఈ సందర్భంగా కర్నూలులో తనకివే చివరి ఎన్నికలని, ఒకే ఒక్క చాన్స్ ఇవ్వాలని బాబు వేడుకోవడం టీడీపీకి రాజకీయంగా భారీ డ్యామేజీ కలుగుతోంది. దీంతో నష్ట నివారణకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు.
తన రాజకీయ జీవితంలో కర్నూలు పర్యటనలో వచ్చినంత జనాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. చిన్న పిల్లలు మొదలుకుని అన్ని వర్గాల ప్రజానీకం రోడ్డు మీదకి తరలి వచ్చినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు సాధ్యం కాదని కర్నూలులో తేల్చి చెప్పినట్టు చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇక చంద్రబాబు కామెడీ కామెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి వైసీపీ జిల్లా అధ్యక్షులని మార్చారట! కొందరైతే తమకు పదవి వద్దని వెళ్లిపోయారని చంద్రబాబు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి అతిశయోక్తులు, సరదా కామెంట్స్ కేఏ పాల్ లేదా బండ్ల గణేశ్ లాంటోళ్లు మాట్లాడితే హాయిగా నవ్వుకోవచ్చు. కానీ ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్న చంద్రబాబు మాట్లాడ్డమే కాసింత వింతగా తోస్తోంది.
ఇక ఇదే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్నావంటూ చంద్రబాబును వేలాది మంది నిలదీశారు. తన టూర్కు గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో జనం వచ్చారని చంద్రబాబు అంటున్నారు. వారంతా వచ్చింది ఎందుకో చంద్రబాబు తెలుసుకోవాలి. తమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నావని నిలదీయానికి మాత్రమే అని చంద్రబాబు అర్థం చేసుకుంటే మంచిది. కిందపడ్డా అదో లగువు అన్నట్టుగా చంద్రబాబు వైఖరి వుంది.