ప్రచార లోపం.. కళ్ల ముందు కనిపిస్తోందిలా!

విడుదలకు ముందే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాపై లవ్ టుడే మూవీ పైచేయి సాధించింది. ఇక్కడ దిల్ రాజు పనిగట్టుకొని చేసిందేం లేదు. మారేడుమిల్లి యూనిట్ చేసుకున్న స్వయంకృతాపరాధం ఇదంతా. Advertisement అల్లరి నరేష్…

విడుదలకు ముందే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాపై లవ్ టుడే మూవీ పైచేయి సాధించింది. ఇక్కడ దిల్ రాజు పనిగట్టుకొని చేసిందేం లేదు. మారేడుమిల్లి యూనిట్ చేసుకున్న స్వయంకృతాపరాధం ఇదంతా.

అల్లరి నరేష్ నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఎలాంటి పోటీ లేని టైమ్ లో వస్తున్న ఈ సినిమాకు ఏమాత్రం ప్రచారం చేసినా ఆడియన్స్ దృష్టి దీనిపై పడి ఉండేది. కానీ అలాంటి ప్రయత్నం మచ్చుకైనా కనిపించలేదు. విడుదలకు ఒక్క రోజు ముందు యూనిట్ అంతా ప్రెస్ మీట్ పెట్టారు. అంతకంటే చాలా రోజుల ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. అంతే, అక్కడితో చేతులు దులుపుకున్నారు.

ఇటు లవ్ టుడే యూనిట్ మాత్రం దిల్ రాజు ఇచ్చిన అండతో ప్రచారంలో దూసుకుపోయింది. తమ భాష, ప్రాంతం కాకపోయినప్పటికీ హీరోహీరోయిన్లు ఇక్కడ వాలిపోయారు. ఇంటర్వ్యూలతో ఊదరగొట్టారు. అటు దిల్ రాజు మార్కెటింగ్ యూనిట్ చేసిన సోషల్ మీడియా ప్రచారం కూడా అద్భుతంగా కలిసొచ్చింది. ఆల్రెడీ తమిళ్ లో ఈ సినిమా పెద్ద హిట్టనే విషయాన్ని తెలుగు ప్రేక్షకుల మెదళ్లలోకి చొప్పించగలిగారు.

ప్రచారం చేయని కారణంగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' స్ట్రయిట్ సినిమా ప్రేక్షకులకు దూరమైతే, భారీ ప్రచారంతో లవ్ టుడే అనే డబ్బింగ్ సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. నిజానికి స్క్రీన్ కౌంట్ పరంగా చూసుకుంటే, అల్లరినరేష్ సినిమాకే ఎక్కువ కేటాయింపులు దక్కాయి. కానీ ఫలితం మాత్రం కనిపించలేదు.

ప్రచారంలో చూపించిన తేడా విడుదలకు ముందే కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ తో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా కంటే లవ్ టుడేకే టికెట్లు ఎక్కువగా తెగాయి. అల్లరి నరేష్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ లో 10 శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించకపోవడం బాధాకరం.