వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఊహించని విధంగా పెద్ద కష్టమే వచ్చింది. ఇంతకాలం ఢిల్లీలో ఉంటూ ఏపీ ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బహుశా రఘురామ తప్పులకు మూల్యం చెల్లించేందుకు సమయం దగ్గర పడినట్టే కనిపిస్తోంది.
నిత్యం సూక్తులు వల్లించే రఘురామ అనూహ్యంగా తెలంగాణ పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. అసలే రఘురామకు ఏపీ సీఐడీ అంటే గుండెల్లో దడ. ఇది చాలదన్నట్టు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ జరుపుతున్న సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులతో రఘురామకు సన్నిహిత సంబంధాలున్నాయని సిట్ విచారణలో వెల్లడైనట్టు సమాచారం. దీంతో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆయనకు సిట్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో రఘురామది కీలక పాత్ర ఉండడం వల్లే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్తో రఘురామకృష్ణంరాజు దిగిన ఫొటోలు తెరపైకి వచ్చాయి. రఘురామ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో స్నేహసంబంధాలు కొనసాగిస్తుంటారు. కేవలం సొంత పార్టీ నేతలతోనే ఆయనకు పేచీ. సీఎం సహా వైసీపీ ముఖ్య నేతలపై గత కొంత కాలంగా రఘురామ అవాకులు చెవాకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను గతంలో ఆయనకు ఏపీ సీఐడీ తగిన సత్కారం కూడా చేసింది.
తనకు సీఐడీ సత్కారం చేయడంపై ఆయన న్యాయపోరాటం కూడా చేశారు. ఇటీవల విచారణకు రావాలని ఏపీ సీఐడీ నోటీసు ఇచ్చినా ఆయన ఖాతరు చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణకు హాజరవుతారా? లేక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న బీజేపీ కీలక నేత సంతోష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఉపశమనం లభించలేదు. విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బంది ఏంటని న్యాయస్థానం ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ రఘురామ కోర్టును ఆశ్రయించినా ఇదే పునరావృతం అవుతుందనే చర్చకు తెరలేచింది. ఏది ఏమైనా రఘురామకు బ్యాడ్ టైమ్ మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కేసును తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసులో ఎంత పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్నా విడిచిపెట్టొద్దని కేసీఆర్ సర్కార్ గట్టి పట్టుదలతో వుంది. ఖర్మ కాలి రఘురామ సిట్ విచారణలో ఇరుక్కుంటే… ఏంటి పరిస్థితి?