ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలకు పదును పెడుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో ఏపీ హీటెక్కుతోంది. జనసేనను రౌడీసేనగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ చేయడంతో, ఆ పార్టీకి కోపం వచ్చింది. వైసీపీనే రౌడీ అంటూ పవన్కల్యాణ్ ఓ వ్యంగ్య కార్టూన్ను ట్విటర్లో పోస్టు చేశారు.
ఇక ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా జగన్పై విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ నేపథ్యం, గత చరిత్ర ఏంటో అందరికీ తెలుసని విమర్శించారు. జనసేన పార్టీకి సీఎం కాండక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదని ఆయన అన్నారు.
జనసేన పార్టీపై సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడ్డం విడ్డూరంగా వుందన్నారు. సీఎం జగన్ సభకు వచ్చిన మహిళల చున్నీలను సైతం బయట పెట్టి రమ్మనడం దురదృష్టకరమన్నారు. సభకు మహిళల్ని బలవంతంగా తీసుకొచ్చి, బహిరంగంగా అవమానపరిచిన సీఎం మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
ఇదిలా వుండగా జగన్ చరిత్రపై, అలాగే మహిళలకు క్షమాపణ చెప్పాలని మనోహర్ మాట్లాడ్డంపై నెటిజన్లు సెటైర్స్ విసురు తున్నారు. పవన్కల్యాణ్ చరిత్ర గురించి చెబితే ఎలా వుంటుందో ఒక్కసారి మనోహర్ ఆలోచిస్తే మంచిదని నెటిజన్లు హితవు చెబుతున్నారు. ప్రత్యర్థిపై ఒక వేలు చూపితే, మిగిలిన నాలుగు తమ వైపు వుంటాయనే సత్యాన్ని నాదెండ్ల మనోహర్ గ్రహించాల్సి వుందంటున్నారు.
పవన్ చరిత్ర గురించి మాట్లాడితే, తమ నాయకుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో మనోహర్ ఆలోచించినట్టు లేదని వెటకరిస్తున్నారు. అలాగే మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పాలని మనోహర్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఆ మాటకొస్తే మహిళలకు పవన్కల్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాల్సి వుంటుందో మనోహర్ ఏ మాత్రం ఆలోచించినట్టు లేదని తప్పు పడుతున్నారు. నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలన్నీ తమ అధినాయకుడికి రివర్స్ అటాక్ అయ్యేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.