పాదయాత్ర చేస్తున్నా తెలంగాణా నేతగా గుర్తించడంలేదా?

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవాలన్న, వారి పార్టీలు అధికారంలోకి రావాలన్నా వారు ముందుగా నమ్ముకునేది పాదయాత్రనే. దీన్ని తిరుగులేని సెంటిమెంటుగా భావిస్తారు నాయకులు. సెంటిమెంటుకు తగినట్లు పాదయాత్ర…

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవాలన్న, వారి పార్టీలు అధికారంలోకి రావాలన్నా వారు ముందుగా నమ్ముకునేది పాదయాత్రనే. దీన్ని తిరుగులేని సెంటిమెంటుగా భావిస్తారు నాయకులు. సెంటిమెంటుకు తగినట్లు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన పార్టీల అధినేతలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి పాదయాత్రను బ్రహ్మాండమైన అస్త్రంగా భావిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ పాదయాత్రలు చేశాకే అధికారంలోకి వచ్చారు. ఆయన ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేయగా, చంద్రబాబు, వైఎస్ జగన్ విభజిత ఏపీలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. 

రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడంకోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేశారు. సాధారణంగా పాదయాత్ర నాయకులే చేస్తుంటారు. నాయకురాళ్లు దాని జోలికి పోరనే అభిప్రాయం ఉంది. కానీ దాన్ని తప్పని నిరూపించింది వైఎస్సార్ కుమార్తె షర్మిల. ఉమ్మడి ఏపీలో జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినప్పుడు పార్టీని కాపాడటంకోసం షర్మిల పాదయాత్ర చేయడానికి ముందుకొచ్చింది. ధైర్య సాహసాలతో సుదీర్ఘ పాదయాత్ర చేసింది. తండ్రికి మించిన పాదయాత్ర చేసి రికార్డు సృష్టించింది. 

అప్పటికి ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. కేవలం అన్న కోసం ఆ పని చేసింది. కారణాలు ఏమైనప్పటికీ కాలక్రమంలో ఆమె తెలంగాణలో రాజకీయ నాయకురాలైంది. పార్టీ పెట్టింది. అధికారమే లక్ష్యంగా పాదయాత్ర సాగిస్తోంది. మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 20న రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను మొదలుపెట్టింది. గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. అందుకే సెంటిమెంట్‌గా భావించి తన తండ్రిలాగే చేవెళ్ల నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర మొదలుపెట్టింది. మంచిర్యాల జిల్లాలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

పాదయాత్రలో అధికార టీఆర్ఎస్‌ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలపై ఆమె చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులపై చేసిన ఆరోపణలు రాజకీయంగా వేడి పుట్టించాయి. దీంతో ఆయా మంత్రులు, ఇతర నేతలు కూడా షర్మిలపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పలు విమర్శలు ఎదురవుతున్నా వెనుకడుగు వేయకుండా షర్మిల తన పాదయాత్రను కొనసాగిస్తోంది. అయితే ఆమె ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నప్పటికీ షర్మిల పార్టీకి తెలంగాణలో ఆదరణ లభిస్తుందా లేదా అన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. షర్మిల రాజకీయంగా ప్రధాన స్రవంతిలోకి ఇంకా రాలేదని అంచనా వేస్తున్నారు. 

ప్రధాన రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు వినిపించలేదు. పార్టీ పెట్టిన తర్వాత రెండు సార్లు ఉపఎన్నికలు వచ్చాయి. హుజూరాబాద్‌లో పాటు మునుగోడు ఉపఎన్నికలు వచ్చినా.. షర్మిల పోటీ చేయలేదు. తమ బలం ఎంతో ప్రదర్శించాలని అనుకోలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ ఆమె పోటీకి ఆసక్తి చూపలేదు. దీంతో అసలు వైఎస్ఆర్ టీపీ గురించి ఎక్కడా చర్చ జరగలేదు. ఆమెకు ప్రధానంగా స్థానిక సమస్య ఎదురవుతోంది.

తెలంగాణ రాజకీయ నేతగా ఎక్కువ మంది గుర్తించడానికి ఆసక్తి చూపించడం లేదు. పార్టీలో షర్మిల తప్ప గుర్తుంచుకునే మరొక నేత లేకపోవడం కూడా మైనస్ అవుతోంది. తాను తెలంగాణా కోడలినని ఆమె చెప్పుకుంటున్నా ఆమెను ఆంధ్రా మహిళగానే చూస్తున్నారు. అయితే షర్మిల మాత్రం పట్టిన పట్టు వీడకుండా.. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసింది.  ముందు ముందు పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆమె నమ్మకంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో అధికారం తనదేనంటోంది. చూడాలి ఏం జరుగుతుందో.