విశాఖ పచ్చగా, ప్రశాంతంగా ఉండరాదు!

తెలుగుదేశం పార్టీ సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు దూసుకు వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. పరిపాలనలో, అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తయారు చేయాలని.. తద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి దక్కుతుందని…

తెలుగుదేశం పార్టీ సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు దూసుకు వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. పరిపాలనలో, అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తయారు చేయాలని.. తద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి దక్కుతుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశిస్తుంటే.. అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ వీలైనన్ని కుట్ర రచనలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 

పాదయాత్ర పేరుతో ఒక అశాంతిని సృష్టించాలనుకున్నవారు.. ఆ పాదయాత్రికులే వెనక్కు వెళ్లేసరికి.. ఇప్పుడు సరికొత్త కుట్ర వ్యూహాలకు తెర తీస్తున్నారు. నేరుగా పార్టీ నే రంగంలోకి దించి విశాఖలో ఉండే ప్రశాంత వాతావరణం భగ్నం చేయడానికి తెగిస్తున్నారు. సేవ్ ఉత్తరాంధ్ర అనే ఫేక్ నినాదంతో.. యాత్రలతో రచ్చ రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అనకొండ నోటిలో ఋషికొండ అనే పేరుతో ఒక నాటకీయమైన ఆందోళనను చేపడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు తాజా డ్రామా నడిపిస్తే పోలీసులు అడ్డుకోవడం కూడా నేరముగానే ప్రచారం అవుతుంది. తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని విశాఖవాసులు సంబరపడుతుంటే.. వారికి ఆ ఆనందం మిగలనివ్వకుండా.. ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలను రేకెత్తించడానికి.. విశాఖ వాసుల్లో భయాందోళనలను పెంచడానికి తెలుగుదేశం కుట్ర చేస్తున్నది అనే సంగతి ప్రజలు గుర్తిస్తున్నారు. 

ఋషికొండలో ఏం జరుగుతోంది? అవన్నీ పద్ధతిగా జరుగుతున్న పనులేనా కాదా? వాటిని నిజంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా లేదా? వాటి పట్ల నిజంగా స్థానికులలో కూడా వ్యతిరేకత ఉన్నదా లేదా? ఇలాంటి హేతుబద్ధఅంశాలు ఏవి తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. నిజానికి ఋషికొండల సందర్శించాలని కోరిక కూడా వారికి లేదు. అక్కడ ఏదైనా సమస్య ఉంటే దానిని ఎండగట్టాలనే పట్టుదల కూడా లేదు. 

కేవలం రచ్చ చేయడం.. పోలీసులు తమను నిర్బంధిస్తున్నారు అంటూ యాగీ చేయడం.. ఉత్తరాంధ్రను మొత్తం మింగేస్తున్నారు అంటూ అవాకులు చవాకులు ప్రచారం చేయడం.. ఇంతే తప్ప వాస్తవమైన పోరాట పటిమా పోరాడే దృక్పథం ఆ పార్టీలో కనిపించడమే లేదు.

రోడ్డున పడి రచ్చ చేస్తున్న నాయకులు కొందరైతే.. ఇంట్లో కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కే నాయకుడు చంద్రబాబు నాయుడు. తమ పోరాటాలను పోలీసులు అడ్డుకున్న సరే సేవ్ ఉత్తరాంధ్ర అనే నినాదం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుందని ఆయన బీరాలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది! 

జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయాలి అంటూ గతంలో కూడా ఆయన చాలా నినాదాలు ఇచ్చారు. ఆ కోవలో ఇది సరికొత్త నినాదం. ఈ నినాదాలు అన్నింటినీ ఆయన మడిచి.. అటక మీద పెట్టుకోవాల్సిందే తప్ప.. వీటితో తాను సాధించేది ఏమీ ఉండదు.