మరికొన్ని రహస్యాలు బయటపెట్టిన శృతిహాసన్

శృతిహాసన్ కు దాచుకోవడం ఇష్టం ఉండదు. తనకు సంబంధించిన ఎన్నో రహస్యాల్ని ఇప్పటికే బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తన బాయ్ ఫ్రెండ్ వివరాలతో పాటు, తన ఆరోగ్య సమస్యల్ని కూడా బయటపెట్టింది. ఇప్పుడు తన…

శృతిహాసన్ కు దాచుకోవడం ఇష్టం ఉండదు. తనకు సంబంధించిన ఎన్నో రహస్యాల్ని ఇప్పటికే బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తన బాయ్ ఫ్రెండ్ వివరాలతో పాటు, తన ఆరోగ్య సమస్యల్ని కూడా బయటపెట్టింది. ఇప్పుడు తన కెరీర్ కు సంబంధించిన మరో కీలకమైన విషయాన్ని కూడా రివీల్ చేసింది.

శృతిహాసన్ కు అసలు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదంట. కేవలం డబ్బు సంపాదించడం కోసం ఓ 2 సినిమాలు చేసి ఆపేద్దాం అనుకుందట. ఆ డబ్బు కూడా తన కోసం కాదు, తన రాక్ బ్యాండ్ కోసం సంపాదించాలని అనుకుంది. ఈ విషయాల్ని తాజాగా బయటపెట్టింది శృతిహాసన్.

“నా బ్యాండ్ రిహార్సల్స్ కు డబ్బు కావాలి. బ్యాండ్ లో వ్యక్తులకు డబ్బులివ్వాలి. డ్రమ్ కిట్ తో పాటు యమహా మిక్సర్ కొనుక్కోవాలి. ఇంటి అద్దె కట్టాలి. ఈ లెక్కలన్నీ రాసుకున్నాను. బ్యాలెన్స్ షీట్ తయారుచేసుకున్నాను. ఆ డబ్బు సంపాదించడం కోసం సినిమా చేయాలనుకున్నాను. ఒకే ఒక్క సినిమాతో ఆ డబ్బు సంపాదించి తప్పుకుందామనుకున్నాను. సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కు రాక్ స్టార్ అయిపోవాలని కలలుకన్నాను.”

ఇలా తను సినిమాల్లోకి ఎందుకొచ్చిందనే విషయాన్ని బయటపెట్టింది శృతిహాసన్. ముందుగా 'జానే తు య జానే నా' అనే హిందీ సినిమా చేయాలనుకుంది. ఆ సినిమా స్క్రిప్ట్ వింటున్నప్పుడు కథ కంటే, తన మైండ్ లో బ్యాలెన్స్ షీటే ఎక్కువగా మెదిలిందట.

“ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చానో అలా సినిమాను ప్రేమించడం మొదలుపెట్టాను. ఇంకా చెప్పాలంటే సినిమా అనేది నాకు ఎరేంజ్డ్ మ్యారేజ్ లాంటిది. మెల్లమెల్లగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఇప్పుడు సినిమా లేకుండా ఉండలేకపోతున్నాను.”

అయితే సినిమాతో పాటు మ్యూజిక్ కు కూడా ప్రాధాన్యం ఇస్తానంటోంది శృతిహాసన్. జీవితాంతం మ్యూజిక్ ను కొనసాగిస్తానని చెబుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆ సినిమా సెకెండ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.