నూనె క‌ష్టాలు కోరి తెచ్చుకున్న‌వే!

వంట నూనె ధ‌ర‌లు రెట్టింపు అయ్యాయి. దేశంలోని 24 శాతం మంది ప్ర‌జ‌లు నూనె వాడ‌కాన్ని త‌గ్గించారు. 20 శాతం మంది నూనె ఖ‌ర్చును భ‌రిస్తూ, మిగిలిన ఖ‌ర్చులు తగ్గించుకున్నార‌ని ఒక స‌ర్వే నివేదిక‌.…

వంట నూనె ధ‌ర‌లు రెట్టింపు అయ్యాయి. దేశంలోని 24 శాతం మంది ప్ర‌జ‌లు నూనె వాడ‌కాన్ని త‌గ్గించారు. 20 శాతం మంది నూనె ఖ‌ర్చును భ‌రిస్తూ, మిగిలిన ఖ‌ర్చులు తగ్గించుకున్నార‌ని ఒక స‌ర్వే నివేదిక‌. అయితే నూనె క‌ష్టాలు యుద్ధం వ‌ల్ల మాత్ర‌మే రాలేదు. 30 ఏళ్లుగా దూర‌దృష్టిలోని మ‌న విధానాల్లోనే లోపం వుంది. శ్రీ‌లంక‌లో ఈ రోజు పాలు దొర‌క‌ని ప‌రిస్థితి ఎలా ఏర్ప‌డిందో, ఏదో ఒక రోజు మ‌న‌కి వంట నూనెలు దొర‌క‌ని స్థితి వ‌స్తుంది. దొరికినా సామాన్యులు  కొన‌లేని స్థితి.

శ్రీ‌లంక‌కి రోజుకి 3.4 మిలియ‌న్ లీట‌ర్ల పాలు అవ‌స‌రం. అయితే ఆ దేశంలోని పాడి ప‌రిశ్ర‌మ‌ల వ‌ల్ల 1.3 మిలియ‌న్ లీట‌ర్లు మాత్ర‌మే వ‌స్తాయి. మిగ‌తా అవ‌స‌రాల‌ను పాల పొడి రూపంలో దిగుమ‌తి చేసుకోవాలి. 2021లో ఆ దేశం 317 మిలియ‌న్ డాల‌ర్ల‌ను పాల దిగుమ‌తికి ఖ‌ర్చు చేసింది. ఇపుడు డాల‌ర్లు లేవు, పాలు లేవు. ప‌శువులు పెర‌గ‌డానికి, గ‌డ్డి పెంప‌కానికి అనువైన దేశం శ్రీ‌లంక‌. అయితే పాడి మీద పాల‌కులు దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో చిన్న పిల్ల‌ల‌కి పాలు లేని దుస్థితి.

మ‌నం కూడా ఒక‌ప్పుడు స్వ‌యంశ‌క్తి క‌లిగిన వాళ్ల‌మే. 35 ఏళ్ల క్రితం విస్తారంగా వేరుశ‌న‌గ పండేది. ప్ర‌తి వూళ్లో నూనె మిల్లులుండి ధ‌ర‌లు కూడా జ‌నానికి అందుబాటులో వుండేవి. ఎపుడైతే మ‌లేషియా నుంచి పామాయిల్ దిగుమ‌తి ప్రారంభ‌మైందో, రేటు త‌క్కువ‌ని జ‌నం దాన్ని కొన్నారు. దాంతో వేరుశ‌న‌గ రైతులు ఆర్థికంగా దెబ్బ‌తిన్నారు. గిట్టుబాటు లేక పంట త‌గ్గించారు. దీనికి తోడు స‌న్‌ప్ల‌వ‌ర్ ఆయిల్ గుండెకి మంచిద‌ని ప్ర‌చారం మొద‌లైంది. రేటు ఎక్కువైనా జ‌నం దాని వైపు మ‌ళ్లారు. ఊళ్ల‌లోని నూనె మిల్లుల‌న్నీ మూత‌ప‌డ్డాయి.

ర‌ష్యా, ఉక్రెయిన్ నుంచి వంట నూనెలు, మ‌లేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్ వ‌ర‌ద‌లా దిగుమ‌తి అయ్యింది. దేశీయంగా నూనెగింజ‌ల ఉత్ప‌త్తి త‌గ్గిపోయింది. ఇపుడేమో యుద్ధం. మ‌ళ్లీ స‌జావుగా దిగుమ‌తులు ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయో తెలియ‌దు. ఇండోనేషియా పామాయిల్ ఎగుమ‌తుల‌పై బ్యాన్ విధించింది. డ‌బ్బులున్న వాళ్లు నాలుగైదు వంద‌లు పెట్టి గానుగ నూనె కొంటున్నారు. సామాన్యులు అవ‌స్థ ప‌డుతున్నారు. దీని ప్ర‌భావం హోట‌ల్ ఇండ‌స్ట్రీ, ఇత‌ర‌త్రా తినుబండారాల‌పై ప‌డి ధ‌ర‌లు పెరిగాయి.

దేశీయ వ్య‌వ‌సాయాన్ని, దిగుమ‌తుల‌తో దెబ్బ‌తీసిన ఫ‌లితం క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది.

సౌదీ అరేబియాని చూసి భార‌త్‌, శ్రీ‌లంక లాంటి దేశాలు బుద్ధి తెచ్చుకోవాలి. 50 డిగ్రీల ఎడారి వాతావ‌ర‌ణంలో ల‌క్ష ఆవుల్ని వాళ్లు పెంచుతున్నారు. ప‌శువుల కొట్టాల్ని నీళ్ల‌తో చ‌ల్ల‌బ‌రుస్తూ, దేశానికి అవ‌స‌ర‌మైన పాల‌ని ఉత్ప‌త్తి చేసుకుంటున్నారు.

3 Replies to “నూనె క‌ష్టాలు కోరి తెచ్చుకున్న‌వే!”

  1. మొదటి నుంచి కూడా శ్రీలంక పాడి పై దృష్టి పెట్టలేదు. శ్రీలంకీయులకు పాలు అంటే నీళ్ళలో దిగుమతి చేసుకున్న పాలపొడి కలిపి చేసినదే. వాటిపై multi national companyల ఆధిపత్యం.

    చంద్రిక కుమరణతుంగ అధ్యక్షురాలైన కొత్తలో ఇండియాకు వచ్చి ఇక్కడ పాడి పరిశ్రమలో స్వయం సమృద్ధి సాధించడం చూసి, దానికి మూల కారకుడు అయిన వర్గీస్ కురియన్ ను తమ దేశానికి తీసుకు వెళ్ళారు. కానీ అక్కడ మల్టీ నేషనల్ కంపెనీల ఒత్తిడితో మిగతా రాజకీయ నాయకుల సహకారం లేక కురియన్ ఏమీ చేయలేక వెనుతిరిగి వచ్చారు

  2. వర్గీస్ కురియన్ అధ్వర్యంలో NDDB నూనె ఉత్పత్తి, మార్కెటింగ్ ( ధారా పేరుతో) మొదలు పెట్టింది. అప్పుడు నూనె ధరలు చాలా కంట్రోల్ లో ఉండింది. భాజపా మొదటి సారి అధికారానికి వచ్చిన తరువాత దానిని నీరుగార్చారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాము

Comments are closed.