అగ్రిగోల్డ్ తరహా స్కామ్‌లను అరికట్టాలి

ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో 7 వేల కోట్ల రూపాయల మేర జరిగిన అగ్రిగోల్డ్‌ కుంభకోణం 32 లక్షల మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలు దారుణ మోసానికి,…

ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో 7 వేల కోట్ల రూపాయల మేర జరిగిన అగ్రిగోల్డ్‌ కుంభకోణం 32 లక్షల మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలు దారుణ మోసానికి, వంచనకు గురయ్యాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అన్నారు. అనియంత్రిత డిపాజిట్‌ స్కీమ్‌ల నిషేధం బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్య ఏమిటంటే అగ్రిగోల్డ్ సంస్థ దేశంలోని డిపాజిట్ రెగ్యులేటర్లయిన సెబీ, ఎస్‌బీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇలా 9 మంది రెగ్యులేటర్లలో ఏ ఒక్కరి నుంచి కూడా అనుమతి పొందకుండానే లక్షలాది మంది నుంచి వేలకోట్ల రూపాయల డిపాజిట్లు ఏ విధంగా సేకరించిందన్నది.

అనియంత్రిత డిపాజిట్‌ స్కీమ్‌ల బాధితుల్లో అత్యధిక శాతం నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలే. అలాంటివారు అగ్రిగోల్డ్‌ తరహా డిపాజిట్‌ స్కీములకు ఆకర్షితులై వారి చేతుల్లో మోసానికి గురికాకూదనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ బిల్లును మా పార్టీ తరఫున సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ స్కీముల బారినపడిన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లు ద్వారా ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఆరునెలల వ్యవధిలో వారి కేసులను పరిష్కరించేలా న్యాయ స్థానాలకు కాలవ్యవధి విధించడం కూడా అభినందనీయం. అనియంత్రిత డిపాజిట్లు చట్ట వ్యతిరేకం.

అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి 2 నుంచి 7 ఏళ్ళ వరకు జైలుశిక్ష, 3 నుంచి 10 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తోందని ఆయన అన్నారు. అనియంత్రిత డిపాజిట్ల సేకరణను నిషేధిస్తూ ఈ బిల్లు ద్వారా ఏర్పాటయ్యే యంత్రాంగం వలన డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును మరింత కట్టుదిట్టంగా రూపొందించడానికి వీలుగా విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు.

అనియంత్రిత డిపాజిట్ల సేకరణ జరగకుండా పర్యవేక్షించే అధికార యంత్రాంగానికి కార్యదర్శి అధ్యక్షత వహిస్తారని బిల్లులో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ కార్యదర్శి కంటే కూడా ఆ స్థానంలో ఆర్థిక వ్యవహారాల నిపుణుడు లేదా డిపాజిట్ల సేకరణ స్కీములు, తద్వారా సేకరించిన నిధులు ఎలా దారి మళ్ళితాయో వంటి విషయాలపై మంచి అవగాహన కలిగిన ఎవరైనా బ్యాంకర్‌ను నియమిస్తే ఈ తరహా డిపాజిట్ల సేకరణను ఆదిలోనే నియంత్రించే అవకాశం ఉంటుందని అన్నారు.

అలాగే అక్రమంగా సేకరించే డిపాజిట్ల సొమ్ము ద్వారా కొనుగోలు చేసే ఆస్తులను, ఈ సొమ్మును బినామీల అకౌట్లకు మళ్ళించి వారి ద్వారా సేకరించే ఆస్తులను సైతం జప్తు చేసి డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే అంశాలను బిల్లులో చేర్చాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని పోంజి స్కీములు రాష్ట్ర సరహద్దులు కూడా దాటి జరుగుతున్నందున అలాంటి వాటిని కూడా ఆయా రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సలహా మేరకు నిర్ణీత కోర్టుల పరిధిలోకి తేవాలని కోరారు.