టీవీ షోల్లో బాలీవుడ్ స్టార్స్.. ఎవరి రేటు ఎంత?

సౌత్ లో సినిమా జనాలకు, టీవీలకు కనెక్షన్ కాస్త తక్కువ. ఇప్పుడిప్పుడే సినీ స్టార్స్ టీవీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే నార్త్ లో మాత్రం ఈ కల్చర్ దాదాపు 2 దశాబ్దాలుగా ఉంది. సిల్వర్…

సౌత్ లో సినిమా జనాలకు, టీవీలకు కనెక్షన్ కాస్త తక్కువ. ఇప్పుడిప్పుడే సినీ స్టార్స్ టీవీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే నార్త్ లో మాత్రం ఈ కల్చర్ దాదాపు 2 దశాబ్దాలుగా ఉంది. సిల్వర్ స్క్రీన్ పై పాపులర్ అయిన ఎంతోమంది స్టార్స్, స్మాల్ స్క్రీన్ పైకి కూడా వచ్చారు.

బిగ్ బి అమితాబ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి చాలామంది బుల్లితెర వైపు అడుగులు వేశారు. సిల్వర్ స్క్రీన్ తో సమానంగా స్మాల్ స్క్రీన్ పై కూడా డబ్బులు సంపాదిస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్ లోకి రణ్వీర్ సింగ్ కూడా చేరాడు. ది బిగ్ పిక్చర్ అనే షో చేయబోతున్నాడు. ఇతడు ఒక్కో షోకు ఎంత తీసుకుంటున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే మిగతా స్టార్స్ మాత్రం బుల్లితెరపై ఎంత ఛార్జ్ చేస్తున్నారో చాలామందికి తెలుసు. అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న వ్యక్తి బిగ్ బి.

కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమంతో బుల్లితెరపై అడుగుపెట్టారు బిగ్ బి. ఒక్క సీజన్ మినహా అన్ని సీజన్లకు అమితాబే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బి అంటే కేబీసీ.. కేబీసీ అంటే బిగ్ బి అనేంతలా మారిపోయిందిప్పుడు. ఈ కార్యక్రమం కోసం బిగ్ బి, 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకుంటారట. ఇందులోకి ఎంటరైన తర్వాతే అమితాబ్ తన వందల కోట్ల అప్పులన్నీ తీర్చేశారంటే, ఏ రేంజ్ లో సంపాదించారో అర్థం చేసుకోవచ్చు.

అమితాబ్ తర్వాత టీవీల్లో అత్యథిక సంపాదన సల్మాన్ ఖాన్ దే. బిగ్ బాస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్.. ఆ కార్యక్రమం ప్రారంభం నుంచి ప్రతి సీజన్ కు తనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నార్త్ లో సూపర్ హిట్టయింది ఈ కార్యక్రమం. అలా ఇప్పటివరకు 14 సీజన్లు నడిచాయి. ప్రతి సీజన్ కు తన పారితోషికం పెంచుతూ వస్తున్న సల్మాన్, 14వ సీజన్ లో ప్రతి ఎపిసోడ్ కు 16 కోట్ల రూపాయలు తీసుకున్నాడట.

హిందీలో కేకేకే (ఖత్రోన్ కి ఖిలాడీ) సీజన్స్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న దర్శకుడు రోహిత్ షెట్టి, ఒక్కో ఎపిసోడ్ కు 49 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఇక సూపర్ డాన్సర్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న శిల్పాషెట్టి, తాజా సీజన్ కోసం 18 నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటోందట. అదే విధంగా మరో డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న మాజీ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఒక్కో ఎపిసోడ్ కు 90 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకుంటోంది.

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా బుల్లితెరపైకొచ్చాడు. గతంలో సత్యమేవ జయతే అనే కార్యక్రమం చేశాడు. ఈ కార్యక్రమం కోసం ఒక్కో ఎపిసోడ్ కు 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడట ఈ నటుడు. ఇలా బాలీవుడ్ కు చెందిన ఎంతోమంది నటీనటులు.. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై రెండు చేతులా సంపాదిస్తున్నారు.