భారతీయ జనతా పార్టీలో ఉన్న చంద్రబాబు కోవర్టులు, కోవర్టుల అండదండలతో రెచ్చిపోతూ ఉండే ఇతరప్రముఖులు.. నిత్యం తమకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా పూర్తిచేస్తూనే ఉంటారు. జాతీయ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద బురదచల్లడానికి తమ వంతు కృషి కొనసాగిస్తూ ఉంటారు. ఈ కోణంలోంచి చూసినప్పుడు.. దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ ప్రభుత్వం మీద చేస్తున్న మాటల దాడులు పరాకాష్ట అయితే.. ఇతర పదవుల్లో ఉన్న ఇతర కీలక నాయకులు కూడా అదే మాదిరిగా అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం.
రాష్ట్రంలో కరవు మండలాల ప్రకటన అనే అంశాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయడానికి ఇప్పుడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. క్రమం తప్పకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పంటలు పండుతూనే ఉన్నాయి. అలాగని కొన్ని చోట్ల కరవు పరిస్థితులు ఉన్నమాట కూడా నిజమే. అంతే తప్ప.. ప్రజలు అలమటించిపోయేంత క్షామం రాష్ట్రంలో ఎక్కడా కూడా తాండవించడం లేదు.
ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగానే ప్రభుత్వం కరవు ప్రాంతాల జాబితాను తయారుచేసింది. దీనిమీద ప్రత్యర్థులంతా నానాయాగీ చేస్తున్నారు. లోకేష్ లాంటి అజ్ఞానులు కరవు- జగన్ కవలపిల్లలు అంటూ తలాతోకాలేని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు వంత పాడడానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యా కూడా తయారయ్యారు.
రాష్ట్రంలో 400 మండలాలకు పైగా పంట నష్టం ఉండగా, కేవలం 103 మండలాలను మాత్రమే ప్రకటించడాన్ని ఆయన తప్పు పడుతున్నారు. కరవును తగ్గించి చూపాల్సిన అవసరమేంటి అని అడుగుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉన్నది 680 మండలాలే. అంటే బిజెపి సత్యా దృష్టిలో మూడొంతులకు పైగా కరవు తాండవిస్తోందన్నమాట. రాష్ట్రంలో ఎటుచూసినా పచ్చటి పంటలతో ఉండగా.. ఇలాంటి నివేదికలు చేయాలని ఆయన అంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎటూ జగన్ ను తిట్టడానికి పాట ఎత్తుకున్నారు కాబట్టి.. పోలవరం మీద కూడా విమర్శలు కురిపించారు. పోలవరం ప్రాజెక్టును జగన్ ఆదాయవనరుగా చూస్తున్నారట.
పోలవరం మీద ఆయనకు అంత శ్రద్ధ ఉంటే, దాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఆదాయం సంపాదిస్తున్నాడనే అభిప్రాయం ఉంటే.. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చేతినుంచి తప్పించి.. కేంద్రం తీసుకునేలా చేయవచ్చు కదా. అది జాతీయ ప్రాజెక్టు. పూర్తిగా పనులు కేంద్రమే చేపట్టేలా సత్యా చొరవ తీసుకోవచ్చు కదా అనేది ప్రజల సందేహం.
రాష్ట్రప్రయోజనాల మీద బిజెపికి నిజంగానేశ్రద్ధ ఉంటే.. ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేది. బడ్జెట్ లలో ఈ ప్రాజెక్లుకు ముష్టివేసినట్టుగా నిధులు విదిలిస్తూ.. పోలవరం భారం తలకు మించిపోయేలా తయారుకావడం వెనుక కేంద్రమే అసలు దోషిగా నిలుస్తోంది. అలాంటిది.. పోలవరాన్ని జగన్ ఆదాయానికి వాడుకుంటున్నారని సత్యా అనడం చవకబారుగా ఉంది.
చేతనైతే.. శ్రద్ధ ఉంటే.. పోలవారన్ని పూర్తిగా కేంద్రమే తీసుకునేలా చేసి.. ఏడాదిలోగా పూర్తిచేయిస్తే.. బిజెపికి ప్రజలు నీరాజనాలు పడతారని, ఏపీ ప్రజల ఎదుటకు రావడానికి కమలనాయకులకు కనీసార్హత ఉంటుందని సత్యా తెలుసుకోవాలి.