ఆత్మ‌కూరు టీడీపీ అభ్య‌ర్థిగా వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె!

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నికకు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆత్మ‌కూరులో రాజ‌కీయం వేడెక్కుతోంది. ఆత్మ‌కూరు బ‌రిలో నిల‌వ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఆత్మ‌కూరులో పోటీ చేయ‌డంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నికకు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆత్మ‌కూరులో రాజ‌కీయం వేడెక్కుతోంది. ఆత్మ‌కూరు బ‌రిలో నిల‌వ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఆత్మ‌కూరులో పోటీ చేయ‌డంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే స‌రైన అభ్య‌ర్థి దొరికితే పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టు తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి.

ఆత్మ‌కూరు టీడీపీ అభ్య‌ర్థిగా వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కుమార్తె కైవ‌ల్యారెడ్డి పేరు ఖ‌రారు చేసే అవ‌కాశాలున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. మ‌హానాడుకు భ‌ర్త‌, క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు టీడీపీ యువ‌నాయ‌కుడు రితేష్‌రెడ్డితో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. బ‌ద్వేలుకు స‌మీపంలోనే ఆత్మ‌కూరు ఉంటుంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ప్ర‌త్యేకంగా వ‌ర్గం ఉంది.

గ‌తంలో ఆయ‌న ఆత్మ‌కూరు నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు. మంత్రిగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేశారు. క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కుమార్తె విజ‌యమ్మతో అనం వియ్యం అందుకున్నారు. రితేష్‌రెడ్డితో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కుమార్తె కైవ‌ల్యారెడ్డి వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వీరారెడ్డి విద్యాసంస్థ‌ల కార్య‌ద‌ర్శిగా, అలాగే పారిశ్రామిక‌వేత్త‌గా రితేష్‌రెడ్డికి గుర్తింపు వుంది. బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ కావ‌డంతో అక్క‌డి నుంచి రితేష్‌రెడ్డి లేదా ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ పోటీ చేసే అవ‌కాశం లేదు.

ఈ నేప‌థ్యంలో అవ‌కాశం ఉంటే ఆత్మ‌కూరు నుంచి బ‌రిలో దిగాల‌నే ఆలోచ‌న‌లో రితేష్‌రెడ్డి కుటుంబం ఉన్న‌ట్టు స‌మాచారం. రితేష్‌రెడ్డి భార్య కైవ‌ల్యారెడ్డిని నిలిపేందుకు విజ‌య‌మ్మ కుటుంబం ఆస‌క్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. కైవ‌ల్యారెడ్డి నెల్లూరు జిల్లా వాసిగా, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితురాలే. అలాగే ఆత్మ‌కూరులో తండ్రి ప‌లుకుబ‌డి త‌న‌కు ప‌నికొస్తుంద‌ని ఆమె భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు తన‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే అసంతృప్తి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిలో బ‌లంగా ఉంది. ప‌లు సంద‌ర్భాల్లో త‌న అసంతృప్తిని ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి బ‌య‌ట పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో ఆనం పార్టీ మారుతార‌నే ప్ర‌చారం కూడా లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో ఆత్మ‌కూరు నుంచి కుమార్తెను నిలిపేందుకు ఆనం గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పాటు ప‌రోక్ష స‌హ‌కారం అందించే అవ‌కాశాలు లేక‌పోలేదనే టాక్ న‌డుస్తోంది. 

ఇక్క‌డి నుంచి దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి త‌మ్ముడు విక్ర‌మ్‌రెడ్డి బ‌రిలో నిల‌వ‌నున్నారు. ఆనం త‌న‌య బ‌రిలో వుంటే మాత్రం పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగే అవ‌కాశాలున్నాయి.