మరణించిన నాయకుడికే అన్నీ తెలుసు

నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి అసలైన సమాచారం రాబట్టడం ఈడీ అధికారులకు చాలా కష్టంగానే ఉందని చెప్పొచ్చు. ఆమెను మూడుసార్లు కొన్ని గంటలపాటు…

నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి అసలైన సమాచారం రాబట్టడం ఈడీ అధికారులకు చాలా కష్టంగానే ఉందని చెప్పొచ్చు. ఆమెను మూడుసార్లు కొన్ని గంటలపాటు ఎన్నో ప్రశ్నలు అడిగినా ఆమె నుంచి కీలకమైన సమాచారం ఏదీ ఈడీ అధికారులు రాబట్టలేకపోయారు. 

ఈ కేసుకు సంబంధించి ఆమె చెబుతున్న సమాధానం ఒక్కటే. ఈ కేసులో తనకేమీ తెలియదని, అన్ని విషయాలు చనిపోయిన నాయకుడికే తెలుసనేది సోనియా సమాధానం. సోనియా చెబుతున్న ఆ నాయకుడు ఎవరంటే …మోతీలాల్ ఓరా. మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. 

మూడు రోజుల పాటు విచారించిన ఈడీ.. అవసరమైనప్పుడు మరోసారి పిలుస్తామని తెలిపింది. అంటే ఇదో సీరియల్ అన్న మాట. ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. 

సోనియా గాంధీని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ బుధవారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటికే రెండు రోజులు సోనియాను విచారించిన ఈడీ.. బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించింది. ఇప్పటివరకు ఈడీకి కావలసిన సమాచారం దొరకలేదు కాబట్టి సోనియాను మళ్ళీ పిలిచే అవకాశాలున్నాయి. 

సెంట్రల్ దిల్లీలోని ఈడీ కార్యాలయానికి బుధవారం ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ చేరుకున్నారు. కుమార్తె ప్రియాంకా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ ఆమె వెంట వెళ్లారు. 11.15 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమైంది. కేసు విచారణ జరుపుతున్న కీలక అధికారి.. సోనియాను ప్రశ్నలు అడిగారు. మరో అధికారి ఆమె చెప్పిన సమాధానాలను రాసుకున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం కోసం సోనియా ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3.30కి మరోసారి రావాలని అధికారులు తొలుత సమాచారం ఇచ్చినా  విచారణ ముగిసిందని, ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయానికి రావాల్సిన పని లేదని పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సోనియాకు చెప్పినట్లు సమాచారం. 

సోనియాను ఇప్పటివరకు 95 నుంచి 110 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోనియా.. మరికొన్నింటికి తనకు తెలియవని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఏజేఎల్‌, యంగ్‌ ఇండియన్‌ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మోతీలాల్‌ వోరా.. మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ కేసులో అన్ని విషయాలు తెలిసిన ఓరా ఎప్పుడో గతించారు. 

సోనియాకేమో ఎలాంటి విషయాలూ తెలియవు. మరి ఈడీ ఈ కేసు విచారణను ఎలా ఒక కొలిక్కి తీసుకువస్తుంది?