ముందే ఊహించినట్టుగా ఉన్నారు జేసీ సోదరులు. తాడిపత్రి మున్సిపాలిటీలో ఫలితం టై తరహాలో వస్తే తమకూ ఎక్స్ అఫిషియో బలం ఉండటానికి అనుగుణంగా తమ మేనల్లుడో, అల్లుడో అయిన దీపక్ రెడ్డి చేత తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఓటేయించినట్టుగా ఉన్నారు! అక్కడ ఓటేసేస్తే అక్కడ ఎక్స్ అఫిషియో ఓటు వచ్చేస్తుందని లెక్కలేసినట్టుగా ఉన్నారు. అయితే ఈ అతి తెలివికి కోర్టులో చెక్ పడింది.
మున్సిపల్ ఎన్నికల సమయంలో తాడిపత్రిలో ఓటేసినంత మాత్రానా అక్కడ దీపక్ రెడ్డికి ఎక్స్ అఫిషియో ఓటు రాదని కోర్టులో తేలింది. ఆయన ఎమ్మెల్సీ గా నామినేట్ అయ్యే నాటికి రాయదుర్గం పరిధిలో ఓటు హక్కు ఉంది కాబట్టి, అదే లెక్క అని, అతి తెలివితో తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఓటేయగానే అక్కడ ఎక్స్ అఫిషియో గా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో పాలు పంచుకునే అవకాశం లేదని కోర్టు పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
పోలింగ్ అనంతరం, ఫలితాల అనంతరం ఎక్స్ అఫిషియో అవకాశం కోసం అటు దీపక్ రెడ్డి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కోరారు. అయితే వీరందరి విన్నపాన్నీ ఎన్నికల అధికారి తిరస్కరించారు. వీరెవరూ తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని వారు కాదని, కాబట్టి వారికి ఆ ఛాన్స్ ఉండదని స్పష్టం చేశారు.
అయితే దీపక్ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఓటేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తను లోకల్ అంటూ కోర్టుకెళ్లినట్టుగా ఉన్నారు. ఈ తరహా అతి తెలివి తమ సొంతమని జేసీ ఫ్యామిలీ భావించినట్టుగా ఉంది. అవసరానికి అనుగుణంగా తాడిపత్రికి ఓటు మార్పించుకున్నంత మాత్రానా.. అక్కడ ఎమ్మెల్సీగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో పాలుపంచుకునే అవకాశం లేదని ఇప్పుడు స్పష్టం అవుతున్నట్టుగా ఉంది.
ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యే నాటికి ఎక్కడ ఓటు ఉంటే అక్కడే లెక్క అవుతుంది తప్ప, అవసరానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం లేదని స్పష్టం అవుతోంది! దీంతో దీపక్ రెడ్డి ఓటుతో తాడిపత్రి మున్సిపాలిటీలో గట్టెక్కాలని చూసిన జేసీ సోదరులకు ఝలక్ తగిలినట్టే. ప్రస్తుత లెక్కల ప్రకారం బలాబలాలు సమంగా ఉన్నాయి. మిగతా వ్యవహారం ఏ టాస్ ద్వారానో తేలాలి కాబోలు!