రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్పై ఇటు ప్రభుత్వం, అటు పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అర్ధాంతరంగా ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలనేది అందరి డిమాండ్.
నిమ్మగడ్డ రమేశ్కుమార్ హయాంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టడంతో పాటు ఉత్తర్వులను కొట్టి వేయడం తెలిసిందే.
దీంతో ఎన్నికలకు అడ్డంకులు తొలగాయి. ఈ నెలాఖరులో నిమ్మగడ్డ పదవీ విరమణ చేయనున్నారు. ఇక రెండు వారాలు మాత్రమే నిమ్మగడ్డకు పదవీ కాలం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుబడుతుంటే నిమ్మగడ్డ ఎందుకు వెనకంజు వేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
సమయం తక్కువ ఉంటే, ఆయన కాలయాపన చేయాలని ఎందుకు భావిస్తున్నారో తెలియడం లేదు. మరోవైపు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ప్రతిపక్ష పార్టీలు , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు.
రాజకీయ పార్టీలు ఓటమి భయంతో ఎన్నికల ప్రస్తావన చేయకపోవడంలో ఓ అర్థం ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ మౌనాన్ని నిమ్మగడ్డ ఎందుకు ఆశ్రయించారన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అనే రేంజ్లో హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. పంచాయతీ, పురపాలక స్థానాల్లో అధికార పార్టీ ఘన విజయాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ తన ఘోర పరాజయంగా భావిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు చాలా తక్కువ సమయం ఉందని, కావునా సమరమా? లేక సరెండరా? అనేది తేల్చి చెప్పాలని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికల విషయమై రాజకీయ పార్టీల కేంద్రంగా ఎక్కడైనా చర్చ సాగుతుంది. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఎస్ఈసీ కేంద్రంగా చర్చ జరుగుతుండడం గమనార్హం.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని, ఆ ప్రక్రియను కూడా తన హయాంలోనే పూర్తి చేస్తారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా నిమ్మగడ్డ నిరాసక్తత విమర్శలకు దారి తీస్తోందన్నది పచ్చి నిజం.