అసైన్డ్ భూముల అక్రమాల గురించి సీఐడీ నోటీసుల నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన అనుకూల మీడియానే క్లారిటీ ఇస్తోంది. ఈ విచారణను ధైర్యంగా ఎదుర్కొని బయటపడే ధీమా ఏదీ ఆయన వ్యక్తం చేయడం లేదని పచ్చమీడియానే చెబుతోంది.
కోర్టును ఆశ్రయించి విచారణను ఆపాలనే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్టుగా టీడీపీ అనుకూల మీడియానే కుండబద్ధలు కొట్టింది. నోటీసులు జారీ అనంతరం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరిపారట, ఆ సందర్భంగా ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించాలని డిసైడ్ అయ్యారట. స్వయంగా పచ్చమీడియా చెబుతున్న మాట ఇది.
ఇప్పటికే తనపై దాఖలైన వివిధ అభియోగాలు, తన ఆస్తుల్లోని అక్రమాల గురించి విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లు, తన హాయాంలో జరిగిన అక్రమాలపై విచారణల విషయంలో స్టేలు తెచ్చుకుని పబ్బం గడుపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇది కొత్తదేమీ కాదు. ఏకంగా 18 స్టేలతో రాజకీయ జీవితాన్ని వెల్లదీస్తున్న నేత చంద్రబాబు నాయుడు.
తను నిప్పును అంటూ ప్రతి సారీ చెప్పుకోవడం చంద్రబాబు ప్రత్యేకత. అయితే స్టే లు తొలగితే కానీ అసలు కథ బయటకు రాదు. ఇప్పుడు తాజా కుంభకోణం విషయంలో కూడా మళ్లీ స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు ఈ విచారణలో కూడా కోర్టులు స్టే ఇస్తే.. మళ్లీ తనను ఎవరూ ఏమీ చేయలేకపోయారని, ఎవ్వరూ ఏమీ చేయలేరని చంద్రబాబు నాయుడు ప్రగల్బాలు పలికే అవకాశం ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా చంద్రబాబును ఎవ్వరూ టచ్ చేయలేరని ఆయన భజంత్రీలు కూడా గట్టిగా చెబుతూ ఉంటారు.
వాటిల్లోని లొసుగులను చంద్రబాబు నాయుడు బాగా వాడుకుంటారనేది వారి నమ్మకం. ఇప్పుడు గనుక మళ్లీ సీఐడీ నోటీసుల విషయంలో మళ్లీ స్టే వస్తే వారి నమ్మకం నిజమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్టే రాకపోతే మాత్రం చంద్రబాబునాయుడు కు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది!