ఘనంగా హీరోయిన్ పెళ్లి.. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి

అలనాటి మేటి నటి రాధ కూతురు, మాజీ హీరోయిన్ కార్తీక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కార్తీక-రోహిత్ మీనన్ పెళ్లి ఈరోజు ఘనంగా జరిగింది. తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ లో జరిగిన…

అలనాటి మేటి నటి రాధ కూతురు, మాజీ హీరోయిన్ కార్తీక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కార్తీక-రోహిత్ మీనన్ పెళ్లి ఈరోజు ఘనంగా జరిగింది. తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ లో జరిగిన ఈ పెళ్లికి 80ల నాటి తారలు చాలామంది హాజరయ్యారు. అయితే అందర్లో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రాధ కూతురిగా, నటవారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కార్తీక. నాగచైతన్యతో కలిసి జోష్ అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ఆమెకు కలిసిరాలేదు. అది మాత్రమే కాదు.. తెలుగులో ఆమె చేసిన దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి లాంటి సినిమాలు కూడా ఆమెకు క్రేజ్ తీసుకురాలేకపోయాయి.

తమిళ్ లో చేసిన రంగం సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్టయింది. అయితే ఆ తర్వాత కూడా కార్తీక కెరీర్ ఊపందుకోలేదు. ఆ క్రమంలోనే ఆమె మెల్లగా సినిమాల నుంచి తప్పుకుంది. ఇప్పుడిలా రోహిత్ తో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

కూతురు పెళ్లి కోసం రాధ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి, చాలామంది టాలీవుడ్ ప్రముఖులకు పెళ్లి శుభలేఖలు అందించారు. అయితే ఈవెంట్ లో టాలీవుడ్ నుంచి ఎక్కువ మంది కనిపించలేదు. 80ల నాటి తారలు జాకీష్రాఫ్, భాగ్యరాజ్, రాధిక, సుహాసిని, రేవతి, గీత లాంటి వాళ్లు హాజరయ్యారు.

వీళ్లలో ఇప్పటికీ స్టార్ డమ్ తో కొనసాగుతున్న హీరో చిరంజీవి కావడం విశేషం. అందుకే ఆయనతో ఫొటోలు దిగేందుకు పెళ్లిలో చాలామంది ఆసక్తి చూపించారు. కేరళ సంప్రదాయ పద్ధతిలో కూతురు పెళ్లి చేసింది రాధ.