ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనానికి అడ్డంకులు తొలగాయి. గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు ఆర్టీసీ డ్రాప్ట్ బిల్లుపై సంతకం చేసి ఆమోదించారు. దీంతో కేసీఆర్ సర్కార్… హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ కేసీఆర్ కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇది ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం తప్పనిసరైంది. దీంతో బిల్లును గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది.
మరోవైపు గవర్నర్ వెంటనే ఆమోదిస్తారని, శాసనసభలో ప్రవేశ పెట్టి బిల్లు పాస్ చేసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. అయితే కేసీఆర్ సర్కార్ అనుకున్నట్టుగా జరగలేదు. ఆమోదం తెలపాలంటే తన అనుమానాల్ని నివృత్తి చేయాలని గవర్నర్ చెప్పారు. తాను ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. కార్మికుల శ్రేయస్సు కోసమే బిల్లును పకడ్బందీగా తెచ్చేందుకు కొన్ని సందేహాలను తీర్చాలని ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు సంధించారు.
వీటిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ గవర్నర్ సంతృప్తి చెందలేదు. ఆర్టీసీ ఆస్తులు, ఇతరత్రా ఏం చేస్తారని ఆమె మరోసారి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్టీసీ ఉన్నతాధికారులను రాజ్భవన్కు పిలిపించుకుని చర్చించారు. ఆ తర్వాత ఎట్టకేలకు బిల్లును ఆమోదించారు. దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి మార్గం సుగుమమైంది.
గవర్నర్ పచ్చ జెండా ఊపడంతో వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రెండు రోజులుగా గవర్నర్ తన చర్యలతో ప్రభుత్వాన్ని టెన్షన్కు గురి చేసినా, చివరికి ఆమోదించడంతో ఊపిరి పీల్చుకుంది. కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.