కరోనా కట్టడిలో జగన్ సర్కార్లో చిత్తశుద్ధి కొరవడిందా? అంటే, ఔననే సమాధానం వస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ విధించిన కర్ఫ్యూ నేటితో 10 రోజులు పూర్తి చేసుకుంటుంది. అంటే గడువు ముగిసిపోతుంది.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరు వరకూ కర్ఫ్యూను పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
కనీసం నాలుగు వారాలైనా కర్ఫ్యూ ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలే నెలాఖరు వరకూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించినట్టు ఆళ్ల నాని తెలిపారు.
మరోవైపు కరోనా కట్టడికి జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై జనం పెదవి విరుస్తున్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా మొక్కుబడిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఏపీలో పాజిటివిటీ రేటు ఏప్రిల్ మొదటి నుంచి పెరిగిపోతోందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రజానీకం గుర్తు చేస్తోంది.
ఇందులో భాగంగా వారం వృద్ధిరేటు అత్యధికంగా 30 శాతం వరకు ఉందని స్వయంగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హెచ్చరించినా …జగన్ సర్కార్ మాత్రం కట్టడి చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు , శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా …ఇంకా కర్ఫ్యూ వైపే ప్రభుత్వం మొగ్గు చూపడం ఏంటో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు.
ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ సత్ఫలితాలు ఇచ్చిందని, ఆ దిశగా జగన్ సర్కార్ ఎందుకు ఆలోచించడం లేదని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. గత పది రోజులుగా కర్ఫ్యూ విధించడం వల్ల ఏపీలో ఒనగూరిన ప్రయోజనాలేంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కనీసం 20 వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు వస్తూనే ఉన్నా…. జగన్ ప్రభుత్వం అప్రమత్తం కాకుండా, లాభనష్టాలు లెక్క లేసుకోవడం అమానవీయమని అంటున్నారు. మరోసారి కర్ఫ్యూ వైపే మొగ్గు చూపడం అంటే, కరోనా ఉధృతికి స్థానం కల్పించినట్టే అని చెబుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడ్డం కంటే గొప్ప పని ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.