ఏపీ ప్రభుత్వానికి సంబంధించి వివిధ రకాల సలహాదారుల పదవులను మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యర్థులు ఈయన్ను ముద్దుగా సకలశాఖల మంత్రి అని అంటుంటారు. ఈయన పదవీ కాలాన్ని ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది.
సజ్జలతో పాటు ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ అజయ్ కల్లం, మరో సలహాదారు శామ్యూల్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. వీరిలో శామ్యూల్, అజయ్ కల్లం రిటైర్ ఐఏఎస్ అధికారులు. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అజయ్ కల్లంను సలహాదారుడిగా నియమితులయ్యారు.
ఐఏఎస్ అధికారి శామ్యూల్ రిటైర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. శామ్యూల్ ను తన సలహాదారుగా నియమించుకున్నారు.
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల అమలు బాధ్యతను ఆయనకు అప్పజెప్పారు. నవరత్నాలు కార్యక్రమానికి వైస్ చైర్మన్ గా శామ్యూల్ ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన వారి గురించే తెలిసిందే.