‘ఆ నలుగురు’లో ఒకరు నత్వానీనా?

రాజ్యసభలో ఖాళీ అవనున్న సీట్లకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కోటాకు నాలుగు సీట్లు వచ్చాయి. ప్రతిపక్షం తెలుగుదేశం మరీ ఘోరమైన సంఖ్యలో సీట్లను కలిగి ఉంది గనుక.. ఆ నాలుగుసీట్లూ వైకాపా ఖాతాలోకే…

రాజ్యసభలో ఖాళీ అవనున్న సీట్లకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కోటాకు నాలుగు సీట్లు వచ్చాయి. ప్రతిపక్షం తెలుగుదేశం మరీ ఘోరమైన సంఖ్యలో సీట్లను కలిగి ఉంది గనుక.. ఆ నాలుగుసీట్లూ వైకాపా ఖాతాలోకే వస్తాయి. ఖాళీ అవుతున్న సీట్లలో వైకాపాకు చెందిన వారు ఎవ్వరూ లేరు. ఈ నేపథ్యంలో పార్టీ కొత్తగా నలుగురిని రాజ్యసభకు పంపనుంది. రాజ్యసభలో పార్టీ బలం 6 స్థానాలకు పెరుగుతుంది. నలుగురూ ఎవరనేది ఒక ప్రశ్న అయితే.. ఆ నలుగురులో ఒకరుగా ముఖేష్ అంబానీకి అత్యంత ఆప్తుల్లో ఒకరైన పరిమల్ డి.నత్వానీ కూడా ఉండబోతున్నారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అంబానీ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈ బేటీలో ఆయన కొడుకు అనంత్ అంబానీతో పాటు, వారి కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షుడు పరిమల్ డి.నత్వానీ కూడా వచ్చారు.

నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008లో జార్ఖండ్ లో ఆయన ఇండిపెండెంట్ గా  రాజ్యసభ బరిలోకి దిగి ఎన్నికయ్యారు. 2014లో మళ్లీ ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగియనుంది. దాంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక కావడానికి వైకాపా మద్దతుకోసం అంబానీ తండ్రీ కొడుకులతో కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది.

తమ పార్టీకి దక్కబోతున్న నాలుగు స్థానాల్లో జగన్ రెండింటిని దాదాపుగా ఫైనల్ చేసినట్లే. పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి, ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ల పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టే. మిగిలిన రెండు సీట్లకోసం పార్టీలో బాగానే పోటీ ఉంది. ఇంకా ఆ ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలు కాలేదు.

అయితే ప్రస్తుతం మండలి రద్దు నేపథ్యంలో పదవులు కోల్పోయే ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్లు కూడా పుకార్లున్నాయి. ఇంకా కొందరు తమ సొంత ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందరి పోటీ నడుమ.. అంబానీ ఆబ్లిగేషన్ కోసం నాలుగింటిలో ఒక స్థానాని పరిమల్ డి.నత్వానీకి జగన్ కేటాయించగలరో లేదో వేచిచూడాలి.

బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు