దొరికితే దొంగ, లేదంటే దొరలే అని పెద్దలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ దృష్టిలో ఆ పార్టీ రాష్ట్ర రథసారథి కింజరాపు అచ్చెన్నాయుడు దొంగే. టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వరరావుతో అచ్చెన్నాయుడి చిట్చాట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు టీడీపీని షేక్ చేస్తోంది. అయితే నారా లోకేశ్పై ఒక్క అచ్చెన్నాయుడు మాత్రమే ఆ అభిప్రాయంతో ఉన్నారా? అంటే కాదనే చెప్పాలి.
ఇంకా చెప్పాలంటే లోకేశ్ విషయంలో అచ్చెన్నాయుడు చాలా గౌరవప్రదంగా, ప్రజాస్వామ్యబద్ధంగానే తన అసంతృప్తిని వెళ్ల గక్కారు. ఇదే అచ్చెన్నాయుడు కాకుండా మరే ఇతర టీడీపీ నాయకుల మాటలను వీడియో కెమెరాకు ఎక్కించి ఉంటే… చూసి, విని తట్టుకోలేక లోకేశ్ అఘాయిత్యం చేసుకునే వారేమోనని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
ఇదే చంద్రబాబు అంటే పార్టీలోని అందరికీ గౌరవమని, కానీ పుత్ర ప్రేమ ఆయన్ను బందీ చేసిందనే ఆవేదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఆకుల వెంకటేశ్వరావు, అచ్చెన్నాయుడి మధ్య రికార్డు అయిన వీడియో సంభాషణకు సంబంధించి కొన్ని కీలకమైన ప్రశ్నలు ఇటు సోషల్ మీడియా, అటు టీడీపీ శ్రేణుల నుంచి కూడా వస్తున్నాయి.
“పార్టీ లేదు.. బొక్కా లేదు. అంతా అయిపోయింది. ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి పట్టుబట్టి ఉంటున్నాం. ఆ మనిషే సరిగా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది” అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అనడంలో తప్పేముందని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు, ఏకంగా టీడీపీ రాష్ట్ర రథసారథి మనోభావాలేంటో తెలిసిన నేపథ్యంలో పార్టీని కాపాడు కునేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు చంద్రబాబుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావుకు అచ్చెన్నాయుడుతో పాటు పార్టీ నాయకులు, శ్రేణుల మనోభా వాలు ఏంటో బాగా తెలియడం వల్లే అంత ఓపెన్గా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
“ఇంకేం పార్టీ సార్? లోకేశ్ గాడు …ఉన్నంత వరకూ ఏమీ కాదు. అయిపోయింది సార్. పార్టీ పని అయిపోయింది. జీరో అయి పోయింది. మీరు ఏమైనా అనుకోండి. వీడేమో లోకేశ్ గాడు…వాడిని పలకరిస్తే దొంగోణ్ని చూసినట్టు చూస్తున్నాడు. మరీ అంత అన్యాయమా సార్. వాడికి ఎంత సర్వీస్ చేశా?” అని చంద్రబాబు తనయుడు, భవిష్యత్ టీడీపీ నాయకుడైన లోకేశ్ గురించి వాడు, వీడు అని వెంకటేశ్వరరావు అంటున్నా… అచ్చెన్న అడ్డుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
అంటే అచ్చెన్నాయుడి మనసులో లోకేశ్పై మంచి అభిప్రాయం లేదనే వాస్తవాన్ని గ్రహించే వెంకటేశ్వరావు యథేచ్ఛగా మాట్లాడారని అంటున్నారు. బాబు తర్వాత అంతటి నాయకుడిగా భావిస్తున్న లోకేశ్పై ఆ రకమైన అభ్యంతరకర భాష వాడుతున్నా, కనీసం వారించాలన్న స్పృహ అచ్చెన్నకు లేదనుకోవడం అజ్ఞానమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అచ్చెన్న దొరికాడని, లోకేశ్పై దారుణంగా మాట్లాడే టీడీపీలో దొరకని దొరలెందరో అని సొంత పార్టీలోనే విస్తృత చర్చ సాగుతోంది. దీన్ని కాదనే వారెవరు?
సొదుం రమణ