బెంగ‌ళూరులో మహేష్ మల్టీ ఫ్లెక్స్

హైదరాబాద్ లో ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో వ్యాపార బంధం ఏర్పాటు చేసుకుని, ఎ ఎమ్ బి మల్టీ ఫ్లెక్స్ ను నిర్మించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మరో అడుగు…

హైదరాబాద్ లో ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో వ్యాపార బంధం ఏర్పాటు చేసుకుని, ఎ ఎమ్ బి మల్టీ ఫ్లెక్స్ ను నిర్మించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తున్నారు. బెంగ‌ళూరులో కూడా వరల్డ్ క్లాస్ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బెంగ‌ళూరులో ప్రసిద్ది చెందిన కపాలి థియేటర్ ను కూల్చి, మాల్ ను నిర్మించే పని మొదలయింది. ఈ మాల్ లో థియేటర్ల ఫ్లోర్ ను మహేష్-సునీల్ నారంగ్ కలిసి తీసుకున్నారు. ఎ ఎమ్ బి పేరుతో అక్కడ కూడా మల్టీ ఫ్లెక్స్ ప్రారంభమవుతుంది.

ఎన్ని స్క్రీన్ లు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. దానికి కారణం  ఇంకా సంబంధిత అనుమతలు రావాల్సి వుండడమే. కనీసం 8 స్క్రిన్ లకు పైనే వుంటాయని తెలుస్తోంది. కపాలి మాల్ ను నిర్మించే బిల్డర్లు హైదరాబాద్ లోన ఏ ఎమ్ బి మాల్ ను సందర్శించి, అక్కడి వరల్డ్ క్లాస్ ఎమినిటీస్, ఇంటీరియర్ చూసి, బెంగ‌ళూరు డీల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఇప్పుడు తన థియేటర్ల సామ్రాజ్యాన్ని విశాఖకు కూడా విస్తరించబోతున్నారు. విశాఖ బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ సమీపంలో ఓ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం స్వంతగా స్థలం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో నిర్మిస్తున్న ఓ మాల్ లో స్క్రీన్ లు కూడా సునీల్ తీసుకుంటున్నట్లు బోగట్టా.