ఎవరి బంధువుల కోసం వాళ్లు

సినిమా ఇండస్ట్రీ నిండా వారసత్వాలు, బాంధవ్యాలు వున్నాయన్న సంగతి తెలిసిందే. టాప్ హీరోలు భారీ సినిమాలు చేస్తుంటే వారి బంధువులు, సంబంధీకులు చిన్న మీడియం సినిమాలు చేస్తున్నారు. ఆ చిన్న, మీడియం సినిమాలను కాస్త…

సినిమా ఇండస్ట్రీ నిండా వారసత్వాలు, బాంధవ్యాలు వున్నాయన్న సంగతి తెలిసిందే. టాప్ హీరోలు భారీ సినిమాలు చేస్తుంటే వారి బంధువులు, సంబంధీకులు చిన్న మీడియం సినిమాలు చేస్తున్నారు. ఆ చిన్న, మీడియం సినిమాలను కాస్త ప్రమోట్ చేయాల్సిన బాద్యత ఈ పెద్ద హీరోల మీద పడుతోంది. ఆ విధంగా తమ చరిష్మా వాడి ఆ సినిమాలను పైకెత్తి, తమ వాళ్లను హీరోలుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నెలలో మూడు సినిమాలు ఇలాంటివి విడుదలవుతున్నాయి. తేజ్ ఐ లవ్ యూ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ. ఈ సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కు తేజ మేనమామ, మెగాస్టార్ చిరంజీవి వచ్చేసారు. దాంతో ఫంక్షన్ కళకళలాడింది. మెగాభిమానులు, పలువురు దర్శకులు వచ్చి, ఎవరి రేంజ్ భజన వారు సాగించారు.

ఇక సుధీర్ బాబు సమ్మోహనం సినిమా కూడా వుంది. ఈ ఫంక్షన్ కు మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. సుధీర్ బాబు స్వయానా మహేష్ కు బావ కదా. రాక తప్పదు. అందువల్ల ఇక మహేష్ ఫ్యాన్స్, ఆ హడవుడి ఓ రేంజ్ లో వుంటుంది.

ఆ తరువాత కళ్యాణ్ రామ్ సినిమా నా నువ్వే ఫంక్షన్ వుంది. ఈ ఫంక్షన్ కు కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఫంక్షన్ లకు ఎన్టీఆర్ రావడం ఇటీవల పరిపాటి అయింది. ఆ మధ్య ఒక్క పంక్షన్ కు మాత్రం రాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ లోటు తీరుస్తూ ఎన్టీఆర్ రాబోతున్నారు. అంటే ఇక నందమూరి అభిమానులకు పండగన్నమాట.

పాపం, ఇదే నెలలో విడుదలవుతోంది. కమెడియన్ కమ్ హీరో శ్రీనివాసరెడ్డి సినిమా జంబలకిడి పంబ. దానికే చీఫ్ గెస్ట్ ఎవ్వరూ దొరకడం లేదు. అందరు హీరోలతో మంచి సాన్నిహిత్యం వుండి, మంచి పాత్రలు వేసినవాడే శ్రీనివాసరెడ్డి. కానీ అంతకు మించిన బాంధవ్యాలు, ఆబ్లిగేషన్లు లేవు. అందుకే చీఫ్ గెస్ట్ దొరకడం కష్టమేమో?