పురందేశ్వ‌రిపై తీవ్ర ఆరోప‌ణ‌ల వెనుక బీజేపీ పెద్ద‌లు!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి త‌న మ‌రిది నాయ‌క‌త్వం వ‌హిస్తున్న టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని ఆ పార్టీ జాతీయ నాయ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా…

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి త‌న మ‌రిది నాయ‌క‌త్వం వ‌హిస్తున్న టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని ఆ పార్టీ జాతీయ నాయ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన క్ష‌ణం నుంచి వైసీపీ ప్ర‌భుత్వంపై ఆమె దాడికి దిగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌నేది బీజేపీ జాతీయ నాయ‌క‌త్వ ల‌క్ష్యం. కానీ పురందేశ్వ‌రి మాత్రం టీడీపీపై ఈగ వాల‌నివ్వ‌డం లేదు.

పురందేశ్వ‌రి టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని మాత్ర‌మే కాపాడ్డానికి ప‌ని చేస్తున్నార‌ని గ్ర‌హించిన ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌స్తుతం ప్రేక్ష‌క పాత్ర పోషిస్తున్నారు. పురందేశ్వ‌రి మిన‌హా మిగిలిన ఏపీ బీజేపీ నేత‌లెవ‌రూ నోరు విప్ప‌డం లేదు. ఇదే సంద‌ర్భంలో పురందేశ్వ‌రికి సంబంధించిన అవినీతి చిట్టాను బీజేపీ పెద్ద‌లే వైసీపీ నేత‌ల‌కు అందించి, టార్గెట్ చేయిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

పురందేశ్వ‌రిపై ఇటీవ‌ల వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చాలా పెద్ద మాటే అన్నారు. పురందేశ్వ‌రి గురించి తాను నోరు తెరిస్తే, ఆమె త‌ల ఎక్క‌డ పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారోన‌ని ఘాటు కామెంట్స్ చేశారు. బీజేపీతో స్నేహంగా మెలిగే విజ‌య‌సాయిరెడ్డి ఘాటు కామెంట్స్ చేశారంటే, ఆయ‌న వెనుక ఆ పార్టీ ఢిల్లీ పెద్దలున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పురందేశ్వ‌రికి సంబంధించి అవినీతి వ్య‌వ‌హారాలు ఆ పార్టీ నాయ‌కుల‌కే బాగా తెలుస‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

తాజాగా పురందేశ్వ‌రిపై విజ‌య‌సాయిరెడ్డి అవినీతి బాంబు పేల్చారు. పేల్చింది విజ‌య‌సాయిరెడ్డే అయినప్ప‌టికీ, మందు గుండు సామ‌గ్రి, తుపాకి అన్నీ బీజేపీ నేత‌లు ఇచ్చిన‌వే అని స‌మాచారం. గ‌తంలో పురందేశ్వ‌రి ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్ట‌ర్‌గా వుంటూ, ఆ విమానయాన సంస్థ అమ్మ‌కంలో మీడియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు. ఊరికే ఆయ‌న ఆరోప‌ణ‌లు చేయ‌లేదు.

ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి బీజేపీ పెద్ద‌లు ప‌క్కా ఆధారాలు ఇచ్చార‌ని స‌మాచారం. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ అమ్మ‌కాల్లో పురందేశ్వ‌రి భారీగా ముడుపులు తీసుకున్న వ్య‌వ‌హారంపై బీజేపీ నేత‌ల మ‌ధ్య చాలా కాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అది ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి వ‌ర‌కూ రావ‌డం వెనుక బీజేపీ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయ‌న సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌మా? అని పురందేశ్వ‌రిని నిల‌దీశారు.

అలాగే ఇటీవ‌ల కాలంలో మ‌ద్యం కేంద్రంగా పురందేశ్వ‌రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక ముడుపుల బాగోతం వుంద‌ని బీజేపీ నేత‌లు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చ‌ర్చించుకుంటున్నారు. దాన్నే విజ‌యసాయిరెడ్డి ట‌చ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో మ‌ద్యం స్కాం అంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్న మీరు…మీ భ‌ర్త వెంక‌టేశ్వ‌ర‌రావు, కుమారుడు హితేష్‌, గీతం భ‌ర‌త్ మ‌ద్యం సిండికేట్ బ్రోక‌ర్ల‌తో బేరాలాడి ముడుపులు తీసుకున్న‌ది నిజం కాదా? అని విజ‌య‌సాయిరెడ్డి  ప్ర‌శ్నించారు.

అలాగే హైద‌రాబాద్‌ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో ఖ‌రీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నార‌ని, దానికి ఖ‌ర్చు పెడుతున్న‌ది ఎవ‌ర‌ని ప్ర‌శ్నించడం పురందేశ్వ‌రిని క‌ల‌వ‌ర‌పెడుతోంది. వీటి అన్నింటి వెనుక త‌న పార్టీ పెద్ద‌లు ఇచ్చిన స‌మాచార‌మే కార‌ణ‌మ‌ని పురందేశ్వ‌రికి కూడా బాగా తెలుసు. ఇప్ప‌టికే పార్టీ వైపు నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర‌వుతోంది. ఇప్పుడు తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. పొమ్మ‌న‌లేక పొగ పెట్ట‌డానికే త‌న పార్టీలోని పెద్ద‌లు విజ‌య‌సాయిరెడ్డితో మాట్లాడిస్తున్నార‌నే ఆనుమానాలు ఆమెను వెంటాడుతున్నాయి.  

ప్ర‌త్య‌ర్థుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న పురందేశ్వ‌రి, త‌న స‌చ్ఛీల‌త‌ను నిరూపించుకోడానికి సిద్ధం కావాలి. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఆమె వివ‌ర‌ణ ఇవ్వాలి. లేదంటే ఇవ్వ‌న్నీ నిజాలే అని జ‌నం న‌మ్మాల్సి వ‌స్తుంది.