ఆ పోస్టర్ తోనే అసలు సమస్య?

మెగా హీరోలు ఎందరు వున్నా, మెగాభిమానులు మాత్రం చిరకాలంగా ఒక్కటిగానే వుంటూ మద్దతు ఇస్తూ వచ్చారు. ఆ మధ్య కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త వేరయ్యారు. అయినా మిగిలిన వాళ్లు, మిగిలిన వాళ్లకు…

మెగా హీరోలు ఎందరు వున్నా, మెగాభిమానులు మాత్రం చిరకాలంగా ఒక్కటిగానే వుంటూ మద్దతు ఇస్తూ వచ్చారు. ఆ మధ్య కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త వేరయ్యారు. అయినా మిగిలిన వాళ్లు, మిగిలిన వాళ్లకు అండగా వుంటూనే వస్తున్నారు. కానీ డిజె సినిమా సమయంలో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఒంటరిని చేసేసారు. ఎందుకు జరిగింది? అసలు ఏం జరిగింది? 

మెగా ఫ్యాన్స్ ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్న కథనం ప్రకారం. డిజె విడుదల వరకు మెగాభిమానులు అంతా న్యుట్రల్ గానే వున్నారట. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా, వసూళ్లు బాగుండడంతో, వాళ్లు భరోసాగానే వుండి, హీరోకి మద్దతుగానే మాట్లాడడం, గ్రూప్ ల్లో పోస్టులు పెట్టడం చేసారట. కానీ అయిదో రోజు ఉదయం ఊళ్లలో జరిగిన ఓ సంఘటన వారికి కోపం తెప్పించినట్లు తెలుస్తోంది.

అయిదో రోజు ఉదయమే బి సి సెంటర్లలో ఫస్ట్ వీక్ లో 100 కోట్లు సాధించిన సినిమా అంటూ పోస్టర్లు వెలిసాయట. అది..ఆ పోస్టర్ మెగాభిమానులను అల్లు అర్జున్ కు దూరం చేసినట్లు చెబుతున్నారు. ఫస్ట్ వీక్ లో వంద కోట్లు అంటూ అయిదో రోజుకు పోస్టర్ వేయడం ఏమిటి? పైగా అలా వేసి, మెగాస్టార్ 150వ సినిమా రికార్డు దాటేసినట్లు ఇండైరెక్ట్ గా ప్రకటించడమే కదా? అంటూ మెగాభిమానులు ఫీలయ్యారట.

అంతే ఆ వెంటనే వాట్సప్ ఫ్యాన్స్ గ్రూప్ ల్లో ఈ మేరకు డిస్కషన్లు ప్రారంభమయ్యాయట. ఇక అక్కడి నుంచి మెగాభిమానులు అల్లు అర్జున్ కు దూరం కావడం ప్రారంభమయ్యారని తెలుస్తోంది.

సరే, ఆ సంగతి అలా వుంచితే ఫస్ట్ వీక్ లో వంద కోట్లు అని నిర్మాత దిల్ రాజు ఫస్ట్ వీకెండ్ లోనే ప్రకటించారు. అంటే సక్సెస్ మీట్ లో ఆ మాట అన్న నైట్ కు నైట్ నే అదే డిజైన్ తో పోస్టర్లు వేసి, నాలుగో రోజు జిల్లాలకు పంపి, అయిదో రోజు అంటించేసారన్నమాట. సరే, సినిమాకు మరింత పుష్ ఇవ్వడం కోసం నిర్మాత ఏదో చేసి వుంటారు, కానీ అదే అల్లు అర్జున్ కు మెగాభిమానులను దూరం చేస్తుందని ఆయన అనుకుని వుండరు. అన్ని పోస్టర్లు ఒకేలా వుండవు మరి.