ఎవరా నిర్మాత.? ఏమా కథ.?

తెలుగు సినీ పరిశ్రమతో గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కి సంబంధాలున్నాయనే విషయం తాజాగా వెలుగు చూసింది. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాతని నయీం బెదిరించాడనీ, ఏకంగా 8.5 కోట్లు ఈ బెదిరింపుల కారణంగా సదరు నిర్మాత, నయీంకు…

తెలుగు సినీ పరిశ్రమతో గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కి సంబంధాలున్నాయనే విషయం తాజాగా వెలుగు చూసింది. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాతని నయీం బెదిరించాడనీ, ఏకంగా 8.5 కోట్లు ఈ బెదిరింపుల కారణంగా సదరు నిర్మాత, నయీంకు సమర్పించుకున్నాడనీ తెలుస్తోంది. కాంబినేషన్లు సెట్‌ చేయడంలో ఆ నిర్మాతకి వున్న ప్రత్యేకత గురించి అప్పట్లో టాలీవుడ్‌లో అంతా కథలు కథలుగా చెప్పుకున్నారు. అనూహ్యంగా నిర్మాత అయి, భారీ చిత్రాలు తీసి, ఇప్పుడు పూర్తిగా సైలెంటయిపోయాడా నిర్మాత. 

ఇంకోపక్క ఓ సినీ హీరోయిన్‌ని బెదిరించిన నయీం, ఆమె నుంచి బలవంతంగా భూమిని లాక్కున్నాడట. ఈ కేసులో నయీంకి టాలీవుడ్‌కి చెందిన ప్రముఖుడొకరు సహకరించాడన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. నిర్మాతల్ని బెదిరించి పబ్బం గడుపుకునే టైపు 'ప్రముఖులు' టాలీవుడ్‌లో అక్కడక్కడా కన్పిస్తారు. అలాంటోళ్ళకి నయీమ్‌ అత్యంత సన్నిహితుడట. ఒకటీ అరా సినిమాలకి దర్శకత్వం వహించిన ఒకాయన, నయీం పేరు చెప్పి, తెలుగు సినీ పరిశ్రమలో 'ప్రత్యేక గౌరవం' సంపాదించేవాడంటూ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 

ఓ ప్రముఖ దర్శకుడితో సినిమా తెరకెక్కించేందుకు నయీం సంప్రదింపులు జరిపాడనీ, తన జీవిత కథనే, తనకు అనుకూలంగా సినిమాగా తెరకెక్కించాలని ఆ ప్రముఖ దర్శకుడితో నయీం గోవాలో సిట్టింగ్‌ వేశాడనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. మిగతా విషయాలెలా వున్నా, నయీం దెబ్బకి సినిమా నిర్మాణమే మానేసిన ఆ నిర్మాత గురించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అతనెవ్వరబ్బా.? అన్నది అధికారికంగా పోలీసులే తేల్చాలి. 'సిట్‌' విచారణ జరుగుతోంది గనుక.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయా.? వేచి చూడాల్సిందే.