ఇంద్రలోకపు రారాజు దేవేంద్రుడికి ఒక పెద్ద చిక్కు సమస్య వచ్చి పడింది. తనలో రసదృష్టి నశించిపోయిందని అనిపించ సాగింది. సౌందర్యాత్మక దృష్టి చచ్చిపోయిందనే భయం పుట్టింది. తన లోకంలో.. కొన్ని యుగాల నుంచి.. వాళ్లే సౌందర్య రాశులు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ.
ఎన్నియుగాలుగా చూసినా అవే మొహాలు.. అవే అందాలు. వెరసి.. తనలోని సౌందర్యాత్మకతకే లోపం వచ్చినట్లుగా ఆయన భీతిల్లిపోయాడు. తన ఇంద్రలోకపు వన్నెలన్నీ సౌందర్యం చుట్టూ అల్లుకున్నవే.. అవన్నీ ఇక క్రమంగా నశించిపోతాయని ఆందోళన చెందాడు. దీనికి పరిష్కార మార్గం తోచలేదు.
చాలా మధనపడిపోయాడు. ఆందోళన హెచ్చింది. అమృతం సహించడంలేదు.. అనిమేషుడే అయినా.. విశ్రాంతిలో కూడా మనసు నిమ్మళంగా ఉండడం లేదు. ఇక తాళలేక ఆయన సృష్టి కర్త దగ్గరకు వెళ్లాడు.
పాపులను, దుర్మార్గులను, ఆశపోతులను, అక్రమార్కులను ఇలా అనేక మందిని తయారుచేయడంలో బిజీగా ఉన్నాడు బ్రహ్మ. ఆ తొందరపాటులో కొందరికి ఆయా లక్షణాలను కూర్చడం మరచిపోతున్నాడు. అలాంటి సమయంలో వచ్చాడు ఇంద్రుడు.
‘‘స్వామీ.. ఇంద్రలోకంలో సౌందర్యం మసకబారిపోయింది... అమరావతి నగర వెలుగుజిలుగులు మొత్తం పొద్దువాలిపోయినట్లున్నవి. ఏమాత్రం శోభస్కరంగా అనిపించడం లేదు. మీరు దయచేసి ఒక అత్యద్భుతమైన సౌందర్యాన్ని సృజించి నాకు ప్రసాదించాలి.. అమరపురికి వన్నెతేవాలి’’ అని ప్రార్థించాడు.
‘‘రంభ ఊర్వశి మేనక ఉన్నారుగా’’ అన్నాడు బ్రహ్మ. ‘‘వారి సౌందర్యానికి ఎక్స్పెయిరీ డేట్ అయిపోయింది స్వామీ’’ అన్నాడు ఇంద్రుడు. దానికి బ్రహ్మ ఇలా అన్నాడు...
‘‘పిచ్చివాడా! ఎక్స్పెయిరీ డేట్ అంటూ లేని సౌందర్యాన్ని నేను భూలోకానికి కానుకగా ఇచ్చాను.. అదిగో.. అక్కడ ఉంది చూడు.. అలాంటి సౌందర్యాన్ని మళ్లీ మళ్లీ సృజించడం కుదరదు’’ అటు చూశాడు ఇంద్రుడు.
అక్కడ శ్రీదేవి ఉంది.
ఆ రకంగా..
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు