Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీ స్నిప్పెట్స్‌- వహీదా రెహమాన్‌

''బాజ్‌'' తర్వాత గురుదత్‌ స్వంతంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ''ఆర్‌ పార్‌'' (1954), ''మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55''(1955) సినిమాలు హిట్‌ కావడంతో ''సి.ఐ.డి'' (1956) దేవ్‌ ఆనంద్‌, షకీలాలతో ప్లాను చేసి దాని దర్శకత్వాన్ని తన శిష్యుడు రాజ్‌ ఖోస్లాకు అప్పగించి తను పర్యవేక్షించాడు. ఈ సినిమాలోనే గురుదత్‌ వహీదా రెహమాన్‌ను హిందీ తెరకు పరిచయం చేశాడు. అంతకుముందు ఆమె నటించిన ''జయసింహ'', ''రోజులు మారాయి'' తెలుగులో వచ్చాయి కాబట్టి దేశంలో ఎవరికీ ఆమె గురించి పెద్దగా తెలియదు. ఈ సినిమా నిర్మాణంలోనే అప్పటికే వివాహితుడైన గురుదత్‌ వహీదాతో ప్రేమలో పడ్డాడు. ఇస్తానన్న పారితోషికంతో బాటు ఆమెకు ఒక కారు బహుమతిగా యిచ్చాడు.

దీనివల్ల వహీదా ఎంత సంతోషించిందో తెలియదు కానీ ఓ.పి.నయ్యర్‌ మాత్రం భగ్గుమన్నాడు. గీతా బాలి రికమెండేషన్‌పై ''బాజ్‌''కి తీసుకున్న తర్వాత ఓ.పి.నయ్యర్‌ - గురుదత్‌ జోడీ బాగానే నడిచింది. ''ఆర్‌ పార్‌'', ''మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55'' సినిమాలకు ఓపి యిచ్చిన సంగీతం బాగా హిట్‌ అయింది. 'సి.ఐ.డి. సినిమాకు కూడా నువ్వే చేయి, నీకో కారు బహుమతిగా యిస్తాన'ని గురుదత్‌ మాట యిచ్చాడు కానీ యివ్వలేదుట. తనకు యివ్వకపోగా వహీదాకు యివ్వడం అతనికి కోపం తెప్పించింది. 

దీని ఫలితమో, కాదో తెలియదు కానీ ''సిఐడి'' తర్వాత గురుదత్‌ తీసిన స్వంత సినిమాలకు చాలాకాలం పనిచేయలేదు. ''12 ఓ క్లాక్‌'' అనే 1958 సినిమాలో హీరో, హీరోయిన్లు గురుదత్‌, వహీదా, సంగీతం ఓపి. కానీ అది తీసినది జి.పి.సిప్పీ. గురుదత్‌ వహీదా బంధం తెగిపోయాక తీసిన ''బహారేఁ  ఫిర్‌ భీ ఆయేంగే'' సినిమాకు సంగీతదర్శకత్వం వహించడానికి తిరిగి వచ్చాడు ఓ.పి.నయ్యర్‌.

వహీదా రెహమాన్‌ తెలుగమ్మాయి అంటారు కానీ ఒరిజినల్‌గా తమిళనాడు ముస్లిము. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఆంధ్రలో చాలాకాలం గడిపారు. ''రోజులు మారాయి'', ''జయసింహ'' సినిమాల నాటికి ఆయన విజయవాడలో మునిసిపల్‌ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు ప్రాంతాల్లో పెరగడం వలన వహీదాకు తెలుగు బాగా వచ్చు. ''రోజులు మారాయి'' సినిమాలో 'ఏరువాక సాగారోయ్‌' పాటలో నర్తించింది. ఎన్టీయార్‌ ఆమెకు ''జయసింహ''లో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర యిచ్చి నటింపజేశారు. ''మిస్సమ్మ'' సినిమాను హిందీలో తీయడానికి వీలుపడుతుందేమో చూద్దామని హైదరాబాద్‌ వచ్చిన గురుదత్‌ వహీదాను మెచ్చారు. ప్రత్యక్షంగా కలిసి తన సినిమా ''సి ఐ డి''లో హీరోయిన్‌గా వేయడానికి హిందీ రంగానికి ఆహ్వానించారు. ఇది 1955లో జరిగింది. 

ఆమె హిందీ సినిమాలో ప్రసిద్ధ నటి అయ్యాక ఓ సారి మద్రాసు ఎయిర్‌పోర్టులో అన్నపూర్ణా నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి  ఎదురైంది. 1951లో తెనాలిలో డాన్సు ప్రోగ్రాం యిచ్చిన రోజులనుండి యీయనకు తెలుసు. 'పెళ్లి చేసుకోబోతున్నానండి'' అందామె. 'శుభం, పెళ్లి చేసుకోబోయేముందు ఓ తెలుగు సినిమాలో నటించ కూడదా?'' అన్నారీయన. ''మీరు తీస్తానంటే నేను వేయనంటానా?'' అందామె సమాధానంగా.

యద్దనపూడి సులోచనారాణి రాసిన ఓ సీరియల్‌ ఆధారంగా ''బంగారు కలలు'' సినిమా తీస్తూ మధుసూదనరావుగారు నాగేశ్వరరావు పక్కన హీరోయిన్‌ వేషం ఆఫర్‌ చేశారు వహీదాకు. ఆమె సరేనంది. ఆ సినిమాలో ముఖ్యమైన చెల్లెలు పాత్రను లక్ష్మికి యిచ్చారు. కానీ అదే సమయంలో చలం నిర్మించిన మరో సినిమాలో కూడా లక్ష్మిది యిలాటి పాత్రే! పోలిక వస్తుందని భయపడి, హీరోయిన్‌గా లక్ష్మిని పెట్టుకుని చెల్లెలు పాత్ర వహీదాను వేయమంటే... అనుకున్నారు అన్నపూర్ణావారు. 

అంత పెద్ద స్టార్‌ దిగివచ్చి వేషం వేస్తానంటే యిలా చెల్లెలు పాత్ర వేయమంటే ఏం బాగుంటుంది? అని జంకారు. ఏమైతే అది అయిందని ఆమెను కలిసి విషయం చెప్పారు. ఆమె కొద్దిసేపు ఆలోచించి ''నేను ఆర్టిస్ట్‌ను. చేసేది మంచి పాత్రా? కాదా? అని తప్ప హీరోయిన్‌గానే వేయాలన్న పట్టుదల నాకేమీ లేదు. నేను రెడీ'' అందామె.

ఆమె ఔదార్యం అంతటితో ఆగలేదు. తనతో బాటు మందీమార్బలం ఎవరూ లేకుండా ఓ టచప్‌ వుమన్‌ను తెచ్చుకున్నారామె. పాత్రకు కావలసిన కాస్ట్యూమ్స్‌, మేకప్‌ మెటీరియల్‌ బొంబాయినుండి తానే తెచ్చుకున్నారు. రిట్జ్‌ హోటల్‌లో రూము బుక్‌ చేస్తే ''ఎందుకండీ దండగ! నేను కూడా సారథీ స్టూడియోలో వుంటాను'' అంది. చివరకు ఆమెను ఒప్పించి 'బ్లూ మూన్‌' హోటల్లో బస ఏర్పాటు చేశారు. తెలుగు నటీనటులతో కూడా ఏపాటి భేషజం లేకుండా నటించారామె. మాజీ కేంద్రమంత్రి టి. సుబ్బరామిరెడ్డి ఓ క్లబ్‌లో చిలిపి కస్టమర్‌గా చిన్న పాత్ర వేస్తూ క్లబ్‌ డాన్సు చేస్తున్న వహీదా బుగ్గ గిల్లడం ఓ విశేషం! ఆవిడ దానికి అభ్యంతరం చెప్పకపోవడం మరీ విశేషం! (సశేషం) (ఫోటోలు-  ''సిఐడి'' సినిమాలో దేవ్‌ ఆనంద్‌తో, ''బంగారు కలలు''లో ఎస్వీ రంగారావుతో.. వహీదా) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?