Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : పాలస్తీనా సమస్య - 02

ప్రపంచ యుద్ధాలు రెండిటికి ప్రధాన రంగస్థలం యూరోప్‌. దానికి మూలం సైన్సు సాధించిన పారిశ్రామిక విప్లవం. నూతన ఆవిష్కరణ ఫలితంగా పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది. అక్కణ్నుంచి ఫ్రాన్సు, పోర్చుగీస్‌, స్పెయిన్‌ వంటి పొరుగు దేశాలకు ఆ తర్వాత అమెరికా, జపాన్‌ దేశాలకు విస్తరించింది. తాము  వస్తువులు తయారుచేయాలంటే ముడిసరుకు కావాలి. దాన్ని తమ దేశానికి పట్టుకుని వచ్చి ప్రాసెస్‌ చేశాక తయారు చేసిన సరుకులను మళ్లీ అమ్ముకునేందుకు మార్కెట్‌ కావాలి. అప్పుడే తమ వద్ద సంపద పోగుపడుతుంది. కానీ ముడిసరుకులు అచ్చుకుని, తర్వాత ప్రాసెస్‌డ్‌ గూడ్స్‌ను హెచ్చుధరతో కొనడానికి ఏ దేశమూ ఒప్పుకోదు. అందువలన దాన్ని ఎలాగోలా జయించి వలస రాజ్యంగా మార్చుకోవాలి. దోపిడీ దొంగల్లా కాకుండా పెట్టుబడిదారీ విధానంలో దోచుకోవాలి. అదీ డైరక్టుగా కాకుండా తమ దేశధనికులు పెట్టుబడి పెట్టిన కంపెనీల ద్వారా సాధించాలి. మరీ అవసరమైతే ప్రభుత్వమే రంగంలోకి దిగాలి. ఇంగ్లీష్‌ వాళ్లకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వున్నట్టే, ఫ్రెంచ్‌ వారికీ, డచ్‌ వారికీ అందరికీ యిలాటి కంపెనీలు వున్నాయి. 

1871లో ఫ్రాన్స్‌కు జర్మనీకి యుద్ధం జరిగింది. ఖనిజసంపద, పరిశ్రమలు అపారంగా వున్న ప్రాంతాన్ని ఫ్రాన్సు జర్మనీకి సమర్పించుకోవలసి వచ్చింది. దాని కారణంగా జర్మనీ పారిశ్రామిక రంగంలో బాగా ముందుకు వెళ్లింది. జర్మనీతో ఎలాగైనా పేచీ పెట్టుకుని దానికి వ్యతిరేకంగా మిత్రకూటమి ఏర్పరచుకుని తన ప్రాంతాన్ని తను వెనక్కి తీసుకుందామని ఫ్రాన్సు అనుకుంది. అది అలా అనుకుంటుందని ముందే వూహించిన జర్మనీ ప్రధాని బిస్మార్క్‌ ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రియా, ఇటలీలతో కలిసి త్రిరాజ్య కూటమి ఏర్పరచాడు. వెంటనే దానికి ప్రతిగా ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, రష్యాలు మిత్రమండలి కూటమి ఏర్పరచాయి. రష్యాకు శత్రువైన టర్కీ దేశం (అరబ్బులు వారి పాలనలోనే వున్నారు) జర్మనీ కూటమిలో చేరింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటలీ త్రిరాజ్య కూటమి వదిలేసి మిత్రమండలి కూటమిలో చేరింది. ఇంగ్లండ్‌తో అప్పటికే స్నేహం నెరపుతున్న జపాన్‌ పొరుగున వున్న చైనాలో తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని మిత్రమండలిలో చేరింది. 

జపాన్‌ తనకు పసిఫిక్‌ ప్రాంతంలో ప్రత్యర్థి కాబట్టి లెక్కప్రకారం అమెరికా శత్రుకూటమిలో చేరాలి. అది ముందే వూహించిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు అమెరికాను తమవైపు లాక్కోవడానికి దాన్నుంచి అప్పులు చేసేశాయి. అరువు మీద ఆయుధాలు దిగుమతి చేసుకున్నాయి. తమ డబ్బు కాపాడుకోవడానికి అమెరికా వీళ్ల వైపు నిలబడుతూనే యీ కూటమి వలన నాకేమిటి లాభం? అని అడిగింది. యుద్ధానంతరం చైనాలో, పసిఫిక్‌ ప్రాంతంలో నీకు ప్రాబల్యం కలిగేట్లా చూస్తాయని చెప్పాయి ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌. ఈ ప్రకారంగా యుద్ధంలోకి దిగినవి  పేరుకి యారప్‌ దేశాలు, జపాన్‌, అమెరికా మాత్రమే అయినా వాటి వలస రాజ్యాలుగా వున్న ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కూడా యుద్ధజ్వాలలు రగిలాయి. యుద్ధానంతరం జరిగిన ఒప్పందాల్లో జర్మనీని ఘోరంగా అవమానించి వాళ్లు 25 ఏళ్లు తిరక్కుండా మళ్లీ ప్రపంచయుద్ధానికి తలపడేట్లా చేశాయి. నిజం చెప్పాలంటే ఆ యుద్ధం కారణంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, జపాన్‌, పోలెండ్‌, సెర్బియాలకు తప్ప మరే దేశానికీ మేలు కలగలేదు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?