కోహ్లీ కుమ్ముయ్యాలి.. గేల్‌ చితక్కొట్టెయ్యాలి.!

టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి మన దేశంలో అభిమానులు ఏ స్థాయిలో మద్దతిస్తారో.. అదే స్థాయిలో భారత క్రికెట్‌ అభిమానులు, వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌నీ అభిమానిస్తారు. ఇదంతా ఐపీఎల్‌ పుణ్యమే. ఐపీఎల్‌లో క్రిస్‌…

టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి మన దేశంలో అభిమానులు ఏ స్థాయిలో మద్దతిస్తారో.. అదే స్థాయిలో భారత క్రికెట్‌ అభిమానులు, వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌నీ అభిమానిస్తారు. ఇదంతా ఐపీఎల్‌ పుణ్యమే. ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్‌ సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గేల్‌, విరాట్‌.. బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఇద్దరూ కలిసి మైదానంలో రెచ్చిపోతోంటే, ప్రత్యర్థులు బిత్తరపోయేవారు. 

ఇప్పుడు ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.. అదీ టీ20 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో. వెస్టిండీస్‌ పూర్తిగా క్రిస్‌ గేల్‌ మీదనే ఆధారపడింది. టీమిండియా సంగతి సరే సరి. టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీస్‌ వరకూ వచ్చిందంటే అది కోహ్లీ పుణ్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మరి, క్రిస్‌ గేల్‌.. విరాట్‌ కోహ్లీ.. ఈ ఇద్దరిలో ఇప్పుడు భారత క్రికెట్‌ అభిమానులు ఎవరికి మద్దతిస్తారు.? 

నో డౌట్‌, విరాట్‌ కోహ్లీకే అభిమానుల మద్దతు లభిస్తుంది. ఎందుకంటే, టీ20 సెమీస్‌ మ్యాచ్‌ ఇది. అయినప్పటికీ, కొందరు భారత క్రికెట్‌ అభిమానులు, క్రిస్‌ గేల్‌ సిక్సర్ల మోత మోగిస్తే చూడాలని వుందంటూ సోషల్‌ మీడియాలో అభిప్రాయపడ్తున్నారు. క్రిస్‌ గేల్‌ చితక్కొట్టేయాలట.. విరాట్‌ కోహ్లీ కుమ్మెయ్యాలట.. అంతిమంగా ఫలితం మాత్రం టీమిండియా వైపు వుండాలట. ఇదీ భారత క్రికెట్‌ అభిమానుల ఆశ. 

తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌ ఘనవిజయం సాధించింది. సెకెండ్‌ సెమీస్‌లో గెలిచిన జట్టు, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడ్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ప్రస్తుత టీమిండియా ఫామ్‌ చూస్తోంటే, సెమీస్‌లో వెస్టిండీస్‌ని మట్టికరిపించడం ఖాయమే అన్పిస్తోంది. అలాగని, వెస్టిండీస్‌ని లైట్‌ తీసుకోవడానికి వీల్లేదు. కోహ్లీ రెచ్చిపోవాలి.. గేల్‌ తొందరగా ఔటయిపోవాలి.. ఇదీ ప్రస్తుతం టీమిండియా అభిమానుల మూడ్‌.