హైదరాబాద్ నడిరోడ్డుపై దారుణ హత్య

హైదరాబాద్ నడిబొడ్డున, నడిరోడ్డుపై మరో దారుణహత్య చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగా రోడ్డుపై ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇదొక పరువు హత్య. వరంగల్,…

హైదరాబాద్ నడిబొడ్డున, నడిరోడ్డుపై మరో దారుణహత్య చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగా రోడ్డుపై ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇదొక పరువు హత్య. వరంగల్, నల్గొండ, మెహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో ఇన్నాళ్లూ పరువు హత్యలు చూశాం. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది ఈ దుర్ఘటన.

రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, అదే జిల్లాకు చెందిన అశ్రిన్ సుల్తానా.. కాలేజ్ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. కాలేజ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోనే ఓ కార్ల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు నాగరాజు. అశ్రిన్ ను రహస్యంగా కలిసి పెళ్లికి సిద్ధంగా ఉండమని చెప్పాడు.

ఇద్దరూ ఓ మాట అనుకున్న తర్వాత అశ్రిన్ ఇంటినుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చేసింది. ఆర్య సమాజంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనను ఎవ్వరూ ట్రేస్ చేయకుండా ఉండేందుకు నాగరాజు ఉద్యోగం మానేశాడు. వేరే ఉద్యోగంలో చేరాడు. అయినప్పటికీ తమ ఆచూకి, అశ్రిన్ కుటుంబీలకు తెలిసిందని అనుమానించాడు నాగరాజు.

దీంతో ఇద్దరూ కొన్నాళ్లు విశాఖపట్నం వెళ్లిపోయారు. 2 నెలలు అక్కడే ఉంది, తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా తమకు ప్రాణభయం ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఈ జంట ఫిర్యాదు కూడా చేసింది. అంతా ఓకే అనుకున్నారు ఇద్దరూ. కానీ అశ్రిన్ కుటుంబీకులు వీళ్లను వెంటాడుతూనే ఉన్నారు. ఆచూకి పసిగట్టారు.

నిన్న రాత్రి నాగరాజు, అశ్రిన్ బయటకొచ్చారు. అప్పటికే మాటువేసి ఉన్న అశ్రిన్ సోదరుడు, అతడి స్నేహితుడు ఇద్దరూ నాగరాజును వెంబడించారు. అశ్రిన్ చూస్తుండగానే, నడిరోడ్డుపై నాగరాజును ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు. అశ్రిన్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అలా ప్రేమించడమే నాగరాజుకు శాపంగా మారింది.