గిఫ్ట్ ఇస్తానని పిలిచి గొంతు కోసింది

ఇద్దరూ ఇష్టపడ్డారు. నిశ్చితార్థం కూడా అయింది. వచ్చే నెలలో పెళ్లి. అంతలోనే గిఫ్ట్ ఇస్తానంటూ కాబోయే భర్తను పిలిచిందామె. కళ్లకు గంతలు కట్టింది. కత్తి తీసి విచక్షణారహితంగా దాడిచేసింది. అనకాపల్లిలో జరిగిన ఈ ఘటన…

ఇద్దరూ ఇష్టపడ్డారు. నిశ్చితార్థం కూడా అయింది. వచ్చే నెలలో పెళ్లి. అంతలోనే గిఫ్ట్ ఇస్తానంటూ కాబోయే భర్తను పిలిచిందామె. కళ్లకు గంతలు కట్టింది. కత్తి తీసి విచక్షణారహితంగా దాడిచేసింది. అనకాపల్లిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

పాడేరుకు చెందిన రామానాయుడుకు, రావికమతం మండలానికి చెందిన పుష్పకు పెళ్లి కుదిర్చారు పెద్దలు. హైదరాబాద్ సీఎస్ఐఆర్ లో రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్నాడు రామానాయుడు. ఇద్దరికీ నిశ్చితార్థం అయింది. ఫోన్ లో తరచుగా మాట్లాడుకుంటున్నారు కూడా. వచ్చేనెల పెళ్లి చేసేందుకు పెద్దలు ముహూర్తం కూడా నిర్ణయించారు.

ఈలోగా ఓసారి కలుద్దాం రమ్మని పిలిచింది పుష్ప. కాబోయే భార్య కోరడంతో రామానాయుడు వచ్చాడు. షాపింగ్ కు వెళ్దామంటూ తీసుకెళ్లింది. బుచ్చయ్యపేట మండలం కొమళ్లపూడికి వచ్చిన వెంటనే, ఓ గిఫ్ట్ తెచ్చానని కళ్లు మూసుకుంటే ఇస్తానని చెప్పింది. రామానాయుడు కళ్లకు గుడ్డ కట్టింది.

ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడిచేసింది పుష్ప. ఊహించని ఘటనకు రామానాయుడు బిత్తరపోయాడు. గట్టిగా కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న కొందరు రామానాయుడ్ని రక్షించారు. ప్రాధమిక చికిత్స అందించి, అనకాపల్లి హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఇలా కాబోయే భర్తపై దాడికి పాల్పడ్డానని పుష్ప, తన తల్లిదండ్రులకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు, పుష్ప కోసం గాలిస్తున్నారు.