తాగించి.. పట్టాలపై పడుకోబెట్టి.. భార్య దుర్మార్గం

భార్యల్ని అడ్డుతొలిగించుకోవడానికి కొందరు భర్తలు ఎన్ని ఉపాయాలు ఆలోచిస్తున్నారో.. అదే సమయంలో భర్తల్ని అడ్డుతప్పించుకునేందుకు కొంతమంది భార్యలు కూడా అదే స్థాయిలో కుయుక్తులు పన్నుతున్నారు. మంత్రాలయంకు చెందిన ఓ మహిళ చేసిన పని, ఈ…

భార్యల్ని అడ్డుతొలిగించుకోవడానికి కొందరు భర్తలు ఎన్ని ఉపాయాలు ఆలోచిస్తున్నారో.. అదే సమయంలో భర్తల్ని అడ్డుతప్పించుకునేందుకు కొంతమంది భార్యలు కూడా అదే స్థాయిలో కుయుక్తులు పన్నుతున్నారు. మంత్రాలయంకు చెందిన ఓ మహిళ చేసిన పని, ఈ ఆలోచనలన్నింటిలో పీక్స్ అని చెప్పాలి. భర్తను రైలు పట్టాలపై పడుకోబెట్టి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఈ మహా ఇల్లాలు.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో నారాయణ కూలిపనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇతడి భార్య వరలక్ష్మి. నారాయణ-వరలక్ష్మికి పెద్దగా పడేది కాదు. ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన చిన్నగోవిందు అనే వ్యక్తికి కనెక్ట్ అయింది వరలక్ష్మి. ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది.

రోజులు గడిచేకొద్దీ నారాయణతో కాపురం చేయడానికి ఇష్టపడలేదు వరలక్ష్మి. దీంతో అతడ్ని అడ్డుతొలిగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్న పథకం ప్రకారం.. నారాయణను కర్నూలు తీసుకెళ్లాడు చినగోవిందు. ఫుల్లుగా మద్యం తాగించి రైలు పట్టాలపై పడుకోబెట్టించాడు. రైలుకింద పడి నారాయణ చనిపోయాడు. ఆ వెంటనే వరలక్ష్మి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. కూలి పనులకు వెళ్లిన తన భర్త తిరిగి రాలేదంటూ మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చింది.

కేసు నమోదుచేసిన పోలీసులకు ఎక్కడా క్లూ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి వరలక్ష్మి కోణంలో విచారణ మొదలుపెట్టారు. ఆమె సెల్ ఫోన్ డేటా, లొకేషన్లను ట్రాక్ చేశారు. దీంతో హత్య మేటర్ బయటపడింది. తామే హత్య చేసినట్టు.. వరలక్ష్మి, చినగోవిందు అంగీకరించారు.