ఆ చానెల్ అదే స్ట్రాటజీతో ముందుకెళ్తుందట

‘మనని పట్టించుకోని వాడిని మనం ఎందుకు పట్టించుకోవాలి’ అదే ఆ చానెల్ స్ట్రాటజీ. ఒక విధంగా సరైనదే కూడాను. మీడియా అన్న తరువాత అందరూ ఒకటే. కానీ ఏడాది కాలంగా టాలీవుడ్ లో మీడియా…

‘మనని పట్టించుకోని వాడిని మనం ఎందుకు పట్టించుకోవాలి’ అదే ఆ చానెల్ స్ట్రాటజీ. ఒక విధంగా సరైనదే కూడాను. మీడియా అన్న తరువాత అందరూ ఒకటే. కానీ ఏడాది కాలంగా టాలీవుడ్ లో మీడియా విషయంలో ఎంపకాల కార్యక్రమం ఒకటి మొదలయింది. మాకు ఈ మీడియా చాలు..ఆ మీడియా అక్కర్లేదు.. నాలుగ పేపర్లు చాలు.. మిగిలిన వారు అవసరం లేదు.. చానెళ్లు చాలు.. వెబ్ సైట్లు వద్దు.. ఇలా ఎవరి చాయిస్ వారిది అన్నట్లుగా. 

కానీ పాపులారిటీలోనో, సర్క్యులేషన్ లోనో పెద్దా చిన్నా తారతమ్య వుండి వుండొచ్చు. అది కేవలం ప్రకటనల వరకే పరిమితం కావాలి కానీ, న్యూస్ వరకు రాకూడదు. న్యూస్ అందించే విషయంలో అన్ని మీడియాలను ఒకే విధంగా చూడాల్సి వుంది. కానీ కొంత వరకు అలా జరగడం లేదు.

దీంతో తరచు తలకాయనొప్పి వస్తూంది. ఇప్పుడు నేను శైలజ విషయంలో కూడ అలాగే వుంది. సినిమా మీద ఎవరి ఒపీనియన్ వారిది. అందరకీ నచ్చాలనీ లేదు..నచ్చకూడదనీ లేదు. మంచి చెడ్డలు ఎవరి దృష్టికోణంతో వారు వెల్లడించడం కామన్. ఆ చానెల్ అలాగే చేసింది. దానికి రామ్ ట్విట్టర్ లో ప్రతిస్పందిస్తూ కాస్త సైటైర్ స్టేట్ మెంట్ లు విసిరాడు.

కానీ ఆ చానెల్ మా ఒపీనియన్ మాదే అంటోదని వినికిడి. అంతే కాదు. సినిమాలకు తమ చానెల్ ఇచ్చినంత సపోర్టు మరే చానెల్ ఎప్పుడూ ఇవ్వలేదని, అలాంటిది, ఇప్పుడు టాలీవుడ్ జనాలు మీడియాను ఇలా విడదీయడం ఏమిటి అని ఆ చానెల్ జనాలు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. తమ స్టయిల్ ఇలాగే వుంటుందని, తమను అందరితో సమానంగా చూసేవారిని సమాదరిస్తామని, లేదూ, తాము అక్కర లేదు అనుకున్నవారు, తమ అభిప్రాయంపై మాత్రం ఎందుకు కిందా మీదా కావాలని అంటున్నారని వినికిడి.

నిజానికి ఈ విషయంలో టాలీవుడ్ జనాలను ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారని అనుమానం. ఇలా విడదీసి పాలించడం వల్ల బావుకునేది ఏమీ లేదు. అనవసరపు తలకాయనొప్పులు తప్ప. కానీ ఇలా చేయడం వల్ల ఏ ఉపయోగాలున్నాయని నూరి పోసి, ఈ మార్గాన్ని ఆచరణలోకి తెచ్చారో మహానుభావులు.