ఆ వార్తపై చికాకు పడ్డ పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చిర్రెత్తుకువచ్చింది. అయినా పాపం, అణచుకున్నారు. అయితే ఈ విషయంలో అసలు వైనం మరిచి, ఈవార్తలు ఏమిటి? ఎందుకు రాస్తారిలా? అని ఆ టైమ్ లో తన దగ్గర…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చిర్రెత్తుకువచ్చింది. అయినా పాపం, అణచుకున్నారు. అయితే ఈ విషయంలో అసలు వైనం మరిచి, ఈవార్తలు ఏమిటి? ఎందుకు రాస్తారిలా? అని ఆ టైమ్ లో తన దగ్గర వున్నవారితో కామెంట్ చేసారట. అంతే కానీ, అసలు ఆ వార్తకు మూలమైన పెద్ద మనిషికి ఫోన్ చేసి, ఎందుకు ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారని మాత్రం అడగలేదు. 

ఆలస్యంగా తెలుస్తున్నఈ విషయం ఏమిటంటే? చిరంజీవి, పవన్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ మెగా సినిమా చేయబోతున్నట్లు పార్లమెంట్ సభ్యుడు, నిర్మాత టి సుబ్బరామి రెడ్డి తరపున ఓ ప్రకటన వెలువడింది. ఇంకేముంది? ఇలాంటి మెగా వార్త మళ్లీ మళ్లీ దొరుకుతుందా? మీడియా ఈ వార్తను పట్టుకుని తెగ హల్ చల్ చేసింది. ఈ సినిమా అంతా బుస్ అని, అంత సాధ్యమయ్యే సీన్ లేదని అప్పుడే అందరూ గుసగుసలు పోయారు. 

ఈ వార్త లు తెలిసి, చదవి పవన్ కళ్యాణ్ చికాకు పడ్డారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఎందుకిలాంటి వార్తలకు హడావుడి చేస్తారు అని ఆయన తన సన్నిహితులతో కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు చేస్తున్నారు. ఆ తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా ఏఎమ్ రత్నం నిర్మాతగా మరో సినిమా చేయాల్సి వుంది. ఆ తరువాత ఆయన దగ్గర మైత్రీ సంస్థ అడ్వాన్స్ కూడా వుంది. 

పైకి డైరక్టర్ త్రివిక్రమ్ కూడా వరుసగా పవన్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలు కమిట్ అయి వున్నారు. ఇవన్నీ వుండగా సుబ్బరామిరెడ్డి ఇలా ఎందుకు ప్రకటించారో ఆయనకే తెలియాలి. చిత్రమేమిటంటే, బాహాటంగా ఇటు పవన్ కానీ, అటు త్రివిక్రమ్ కానీ, చిరంజీవి కానీ ఈ ప్రకటనను ఖండించకపోవడం. సింపుల్ గా నవ్వుకుని ఊరుకోవడం. సుబ్బరామిరెడ్డి ప్రకటన కాబట్టి వారు టేకిట్ ఈజీగా తీసుకుని వుంటారు.