అదిగో శౌర్య.. ఇదిగో టైటిల్

నాగశౌర్య ఛలో హిట్ అయిపోవడంతో చాలా మంది కళ్లు ఆ హీరో మీదకు మళ్లాయి. ఇలాంటి టైమ్ లో చిత్రమైన వార్త వండి వార్చేసారు. ఎప్పుడో దశాబ్దం క్రితం నువ్వులేక నేను లేను సినిమా…

నాగశౌర్య ఛలో హిట్ అయిపోవడంతో చాలా మంది కళ్లు ఆ హీరో మీదకు మళ్లాయి. ఇలాంటి టైమ్ లో చిత్రమైన వార్త వండి వార్చేసారు. ఎప్పుడో దశాబ్దం క్రితం నువ్వులేక నేను లేను సినిమా తీసి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయిన డైరక్టర్ కాశీ విశ్వనాద్ ఓ కథ చెప్పి, నాగశౌర్యను ఇంప్రెస్ చేసారని, సినిమాకు టైటిల్ కూడా ఫిక్సయిపోయిందన్నది ఆ వార్త సారాశం.

గురువారం మార్చి ఒకటి అన్నది టైటిల్ అని వార్తలు వెలువడ్డాయి. ఇది చూసి హీరో నాగశౌర్య సన్నిహిత వర్గాలు షాక్ తిన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం నాగశౌర్య అమ్మమ్మగారిల్లు సినిమా చేస్తున్నాడు. తరువాత సినిమాటో గ్రాఫర్ సాయి శ్రీరామ్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. అలాగే శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త దర్శకుడి డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది.

ఈ రెండు సినిమాల తరువాత సాయి కొర్రపాటికి కమిట్ మెంట్ వుంది. ఆ తరువాత ఓ పెద్ద బ్యానర్ కు సినిమా చేయడం అన్నది డిస్కషన్ లో వుంది. మరి మధ్యలో ఈ కాశీ విశ్వనాధ్ సినిమా ఎప్పుడు పుట్టిందో తెలియదంటున్నాయి. అప్పుడెప్పుడో జస్ట్ వచ్చి లైన్ చెప్పారు తప్ప, తరువాత మరింకే చర్చ లేదని, కమిట్ మెంట్ లేదని, బ్యానర్ లేదని, అంటున్నాయి నాగశౌర్య వర్గాలు.

ప్రస్తుతం శౌర్య కమిట్ మెంట్ లు చాలా వున్నాయని, ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం నాగశౌర్య జ్వరంతో బాధపడుతూనే, ఛలో సినిమా విజయం నేపథ్యంలో సక్సెస్ టూర్ చేస్తున్నారని, వచ్చిన తరువాత కాస్త విశ్రాంతి అవసరం అని అంటున్నాయి ఆ వర్గాలు. అస్సలు రెస్ట్ లేకుండా తిరిగేయడం వల్ల శౌర్య జ్వరం పడ్డాడడంటున్నాయి.