దాదాపు ఐదేళ్ల కిందట నటుడు నరేష్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం అవుతూ ఒక సినిమా ప్రారంభం అయ్యింది. అందులో హీరోయిన్ కీర్తి సురేష్. అప్పటికి ఆమెకు ఎలాంటి గుర్తింపూ లేదు. ఎందుకంటే ఆమె అప్పటికి 'మహానటి' కాదు కాబట్టి!
ఆ సినిమా ప్రారంభం గ్రాండ్ గా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తనయుడు మహేశ్ బాబు లు అతిథులుగా హాజరై ఆ సినిమాకు క్లాప్ కొట్టారు. నరేష్ తనయుడు హీరోగా వస్తున్న సినిమా కాబట్టి కొద్దో గొప్పో ఆ సినిమా గురించి హడావుడి కొనసాగింది కానీ, ఆ తర్వాత మాత్రం ఆ సినిమా ఊసులో లేదు!
'ఐనా ఇష్టం నువ్వు' అనే పేరుతో ఆ సినిమా అప్పట్లో రూపొందిందట, ఎప్పుడు విడుదల అయ్యిందో ఎవరికీ తెలీదు. అయితే కొంతమంది స్టార్లు అయ్యాకా, గతంలో వచ్చి ఊసు లో లేకుండా పోయిన వారి పాత సినిమాల విడుదలలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ క్రమంలో ఇప్పుడు కీర్తీ సురేష్ తొలి తెలుగు సినిమా మళ్లీ ఊసులోకి వస్తున్నట్టుగా ఉంది.
ఆ సినిమాను రీరిలీజ్ చేయడం గురించినో, ఇప్పుడే తొలి సారిగా విడుదల చేయడం గురించినో ఇద్దరు నిర్మాతల మధ్యన పోటీ నెలకొందట. వాళ్లిద్దరూ ఎవరికి వారు ఆ సినిమాపై హక్కులు తమకే ఉన్నాయని అంటున్నారట. మరి ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తారో, కీర్తీ సురేష్ ఇమేజ్ ను ఇప్పుడు ఏ మేరకు క్యాష్ చేసుకుంటారో!