అఖిల్‌ రికమండేషన్‌.. చైతూ ససేమిరా.?

అక్కినేని అఖిల్‌ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం 'అఖిల్‌'. నితిన్‌ ఈ చిత్రాన్ని వినాయక్‌ దర్శకత్వంలో నిర్మించిన విషయం విదితమే. హీరోయిన్‌గా బాలీవుడ్‌ నుంచి ఈ చిత్రం కోసమే సయేషా సెహగల్‌ని ఇంపోర్ట్‌ చేసుకున్నారు.…

అక్కినేని అఖిల్‌ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం 'అఖిల్‌'. నితిన్‌ ఈ చిత్రాన్ని వినాయక్‌ దర్శకత్వంలో నిర్మించిన విషయం విదితమే. హీరోయిన్‌గా బాలీవుడ్‌ నుంచి ఈ చిత్రం కోసమే సయేషా సెహగల్‌ని ఇంపోర్ట్‌ చేసుకున్నారు. ప్చ్‌, తొలి సినిమా దారుణ పరాజయాన్నిచ్చింది అఖిల్‌కి. దాంతో తొలి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందనుకున్న సయేషా కూడా, టాలీవుడ్‌కి ఒక్క సినిమాతోనే టాటా చెప్పెయాల్సి వచ్చింది. 

అయితేనేం, సయేషాతో అఖిల్‌ ఫ్రెండ్షిప్‌ మాత్రం అలాగే కొనసాగుతోందట. తాజాగా తమిళంలో విజయ్‌ దర్శకత్వంలో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సయేషా హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌తో 'శివాయ్‌' సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. 

ఇక, తన అన్నయ్య నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమాకి అఖిల్‌, సయేషా పేరుని రికమండ్‌ చేశాడన్నది టాలీవుడ్‌లో విన్పిస్తోన్న హాటెస్ట్‌ గాసిప్‌. అయితే, టాలీవుడ్‌లో సెంటిమెంట్లు ఎక్కువే. ఫ్లాప్‌ హీరోయిన్‌తో సినిమా అంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. పైగా నాగచైతన్య కెరీర్‌ కూడా ఇప్పుడేమంత గొప్పగా లేదు. దాంతో, నాగచైతన్య మరోమాట మాట్లాడనీయకుండా అఖిల్‌కి 'నో' చెప్పేశాడట. దాంతో సయేషా విషయంలో అఖిల్‌ కాస్త డీలాపడ్డాడని టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 

ఇంకోపక్క సయేషా, తమిళంలో తొలి అవకాశాన్ని దక్కించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తూనే వున్నాయనీ, మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఛాన్స్‌ ఎప్పుడిచ్చినా అక్కినేని ఫ్యామిలీతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని అంటోంది సయేషా సెహగల్‌.