ఒకవైపు సందేశాల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన ట్రేడ్ మార్క్ కామెడీల్లో నటిస్తూ ఉన్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ పొందే హీరోల్లో కూడా ఇతడు ముందు వరసలో ఉంటాడు.
ఈ క్రమంలో ఈ హీరో రెమ్యూనరేషన్ గురించి వస్తున్న తాజా వార్తలు ఆసక్తి దాయంగా ఉన్నాయి. సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న 'బచ్చన్ పాండే' సినిమాకు అక్షయ్ కుమార్ ఏకంగా 99 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పొందుతున్నాడు అనేది అనధికార సమాచారం.
ఒక్క సినిమాకు 99 కోట్ల రూపాయలు అంటే ఇది భారీ పారితోషకమే అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇది కూడా సవరించిన పారితోషకమేనట. మామూలుగా అయితే 110 నుంచి 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్థాయిలో ఉందట అక్షయ్ కుమార్ మార్కెట్.
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతల మీద కాస్త దయ చూపి రెమ్యూనరేషన్ ను ఆ మేరకు తగ్గించాడట అక్షయ్ కుమార్. తన రెమ్యూనరేషన్ లో పది నుంచి ఇరవై కోట్ల రూపాయల మొత్తాన్ని తగ్గించి 99 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను ఫిక్స్ చేశాడట అక్షయ్ కుమార్.
అక్షయ్ నటించే కామెడీలకు భారీ ఓపెనింగ్సే వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యనే వచ్చని 'లక్ష్మీ బాంబ్' మాత్రం డిజాస్టర్ అయ్యింది. నాన్ థియేటర్ రిలీజ్ లో కూడా ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
దక్షిణాదిన ఆకట్టుకున్న సినిమానే అయినప్పటికీ రీమేక్ ఎదురుతన్నింది. నాన్ థియేటర్ రిలీజ్ కావడంతో.. ఆ సినిమా కలెక్షన్ల నంబర్లు ఉండకపోవడం అక్షయ్ కు ఊరట.