డబ్బు వెనకే కేసులు.!

ఏదన్నా ప్రోడక్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడం అంటే ఇప్పుడు కాసుల గలగలలతో కూడిన వ్యవహారం. సినిమా తారలకి ఈ మధ్య ఈ తరహా ప్రచారాలతో లక్షలు వచ్చి పడ్తున్నాయి. స్టార్‌ హీరో హీరోయిన్లే కాదు..…

ఏదన్నా ప్రోడక్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడం అంటే ఇప్పుడు కాసుల గలగలలతో కూడిన వ్యవహారం. సినిమా తారలకి ఈ మధ్య ఈ తరహా ప్రచారాలతో లక్షలు వచ్చి పడ్తున్నాయి. స్టార్‌ హీరో హీరోయిన్లే కాదు.. చిన్నా చితకా కమెడియన్ల నుంచి, టీవీ నటుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ రంగంలో డిమాండ్‌ పెరిగిపోయింది. ఒక్కో సంస్థ ఒప్పందాల విషయంలో రికార్డుల్ని సృష్టించేస్తోంది. అగ్రిమెంట్‌ టైమ్‌ని బట్టి ఒక్కోసారి పది కోట్ల రూపాయలకి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భాలూ లేకపోలేదు.

ఆగండాగండీ.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడమంటే ఇకపై కాసుల యవ్వారమే కాదు, కేసుల యవ్వారం కూడా. మ్యాగీ సంస్థ నుంచి వస్తోన్న ప్రోడక్ట్స్‌లో మోతాదుకు మించి ‘ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు’ వున్నాయని తేలడంతో ఆ సంస్థ ఉత్పత్తుల్ని బ్యాన్‌ చేసే దిశగా అడుగులు ముందుకు పడ్తున్నాయి. ఈ క్రమంలో ఆ సంస్థకి ప్రచారకర్తలుగా పనిచేసినవారిపై కేసులు నమోదయ్యాయి. బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌, ప్రీతి జింటాలపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.

కేవలం మ్యాగా సంస్థ మాత్రమే కాదు, తెల్లబంగారం పత్తి నుంచి.. అసలు బంగారం వరకూ దేశవ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా వివిధ ప్రోడక్ట్స్‌కి ప్రచారకర్తలున్నారు. కూల్‌ డ్రిరక్స్‌కి సంబంధించిన ప్రకటనలు మరీ ప్రత్యేకం. వీటిల్లో హానికరమైన పదార్థాలు వాడుతున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అంటే, మొత్తంగా సెలబ్రిటీలంతా కేసుల్లో ఇరుక్కోవడం దాదాపు ఖాయమేనన్నమాట.

అన్నట్టు, ఇలాంటి వ్యవహారాలు భలే విచత్రంగా వుంటాయి. ఏదన్నా ఓ విషయం వెలుగులోకి వస్తే, అది హాట్‌ టాపిక్‌గా మీడియాలో నానినన్నిరోజులూ హంగామా జరుగుతుంది. ఆ తర్వాత అంతా సైలెంటయిపోతుంది. ఎన్నిసార్లు ఇలాంటి కేసులు తెరపైకి రాలేదు.? పాలకులకు చిత్తశుద్ధి వుంటే ఎక్కడో ఓ చోట ఇలాంటి ప్రచారార్భాటాలకు ముగింపు పడ్తుంది.