కాగల కార్యం నాగ్ తీర్చేసాడు

మొత్తంమీద హారిక హాసిని-మైత్రీ మూవీస్ మధ్య బిగుసుకున్న ముడి విడిపోయినట్లే. హారిక హాసిని అనుబంధం సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన శైలజారెడ్డి అల్లుడు, మైత్రీ మూవీస్ నిర్మించిన సవ్యసాచి విడుదల తేదీలపై…

మొత్తంమీద హారిక హాసిని-మైత్రీ మూవీస్ మధ్య బిగుసుకున్న ముడి విడిపోయినట్లే. హారిక హాసిని అనుబంధం సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన శైలజారెడ్డి అల్లుడు, మైత్రీ మూవీస్ నిర్మించిన సవ్యసాచి విడుదల తేదీలపై కాస్త సందిగ్దం నెలకొంది. ముందుగా షూట్ స్టార్ట్ చేసింది తాము అని, ముందుగా సినిమా ఫినిష్ చేసింది తాము అని ఓపెన్ గా కాకున్నా, తెరవెనుక మల్లగుల్లాలు పడ్డారు.

ఇలాంటి నేపథ్యంలో చైతన్య మొగ్గు శైలజారెడ్డి వైపే వుందని ముందు నుంచీ ఈ వ్యవహారంపై ఎప్పటికప్పడు కథనాలతో వెల్లడిస్తూనే వచ్చాం. పైగా ఈనెల 20 తరువాత కానీ చైతన్య అందుబాటులోకి రాడు. వచ్చిన తరువాత పదిరోజులు కనీసం షూట్ వుంది. పైగా రీరికార్డింగ్ ఇప్పుడు మొదలు పెడుతున్నారు. కీరవాణి కనీసం మూడువారాల నుంచి నాలుగు వారాలు టైమ్ అడుగుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఆగస్టు 31లోపు సవ్యసాచి రావాల్సి వుంది. రాకపోతే, మళ్లీ చైతన్య సినిమా నవంబర్ దాకా వేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే సెప్టెంబర్ లో నాగ్ సినిమా వుంది. అక్టోబర్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ సినిమా వుంది. అందుకే నిన్నటికి నిన్న నాగ్-చైతన్య-మైత్రీ యూనిట్ సమావేశం నిర్వహించినట్లు బోగట్టా.

ఆ మీటింగ్ లో శైలజారెడ్డిని ఆగస్టు 31న విడుదల చేయించడానికి, ఎన్టీఆర్ –త్రివిక్రమ్ సినిమా డేట్ చూసుకుని, దానికి రెండు వారాలు ముందుగా సవ్యసాచిని వదలడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  ఈనెల 9న శైలజరెడ్డి ఫస్ట్ లుక్ వస్తుంది. ఈనెల 20 లోగా ఒక పాట మినహా టాకీ మొత్తం పూర్తవుతుంది.