కథ నాదంటే నాది

టాలీవుడ్ లో కథా చౌర్యం కొత్త కాదు. ఒకటే పాయింట్ ను పట్టుకుని కథలు అల్లేసుకోవడం మామూలే. ముఖ్యంగా కొరియన్ తదితర భాషా చిత్రాలు చూసి ఇన్ స్పైర్ అయినపుడు ఇలాంటి సమస్యలు ఇంకా…

టాలీవుడ్ లో కథా చౌర్యం కొత్త కాదు. ఒకటే పాయింట్ ను పట్టుకుని కథలు అల్లేసుకోవడం మామూలే. ముఖ్యంగా కొరియన్ తదితర భాషా చిత్రాలు చూసి ఇన్ స్పైర్ అయినపుడు ఇలాంటి సమస్యలు ఇంకా వస్తాయి. అయితే ఇప్పుడు తలెత్తిన గోడవ వేరేగా వుంది.

హనుమాన్ అనే కొత్త దర్శకుడు త్వరలో విష్ణుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇతను 2008లో నిర్మాత దామోదర ప్రసాద్ కు ఓ లైన్ చెప్పాడట. అది బాగానే వుంది అనడంతో అప్పట్లో రిజిస్టర్ చేసాడట. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అప్పట్లో హనుమాన్ తో కలిసి వున్న లక్ష్మీ భూపాల్ అనే మాటల రచయిత ఇప్పుడు దామోదర్ ప్రసాద్-నందినీ రెడ్డి కలిసి నాగశౌర్యతో సినిమా చేయబోతున్నారు. 

ఈ సినిమా ఈ నెల 13 నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది. ఆ సినిమా కు మాటలు లక్ష్మీ భూపాల్..కథ నందినీ రెడ్డి. నందినీ రెడ్డి ఈ కథను 2011 లో అనుకున్నారట. ఆ మేరకు అప్పట్లో రిలయన్స్ వారికి మెయిల్ ద్వారా వివరించారట కూడా. తన కథనే లక్ష్మీ భూపాల్, నందినీ రెడ్డి కలిసి కొట్టేసారన్నది హనుమాన్ అభియోగం. ఈ మేరకు ఆయన రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసారు. కానీ తమ కథ వేరు అని నందినీ రెడ్డి అండ్ కో అంటున్నారు. అసోసియేషన్ వారు ఇద్దరిని స్క్రిప్ట్ లు సబ్ మిట్ చేయండి, పరిశీలిస్తాం అంటున్నారు. మరేమవుతుందో చూడాలి.

నందినీ రెడ్డి గతంలో హిందీ సినిమాను కొట్టేసి జబర్దస్త్ అనే సినిమా సమంత-సిద్దార్ధలతో తీసిన సంగతి, దానిపై బాలీవుడ్ సంస్థ గొడవ చేసిన సంగతి తెలిసిందే. మరీ కథలకు కరువొచ్చిపడింది టాలీవుడ్ కు. కోత్త పాయింట్ దొరికితే కాపాడుకోవడం కష్టంలా వుంది.