Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'తెలుగుదేశం' మిస్సవుతోంది

'తెలుగుదేశం' మిస్సవుతోంది

ఎన్నికల రాజకీయా సైకాలజిస్ట్, అనలిస్ట్, స్పెషలిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర బరిలోకి అడుగుపెడుతున్నారు. ముందస్తు ఎన్నికలపై జగన్ దృష్టి సారించారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రలోని పల్లెలు ఎలా వున్నాయి? వైకాపా వైపే వున్నాయా? లేదా తేదేపా మళ్లీ బలోపేతం అవుతోందా? జనసేన పరిస్థితి ఏమిటి? అన్నది ఓ సారి అవలోకిస్తే, ఆంధ్రలోని పల్లెల్లో చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. అందరూ కలిసి 2019 ఎన్నికల్లో ఎవరినైతే దారుణంగా రిజెక్ట్ చేసారో, ఆ జనసేనకు జవసత్వాలు కలిగిస్తున్నారు. 

ఊరూరా ఎక్కడిక్కడ సెల్ఫ్ స్టయిల్డ్ జనసేన కమిటీలు పుట్టుకువచ్చేసాయి. జనసేన ఫ్లెక్సీలు ఇప్పుడు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టిగా కనిపిస్తున్నాయి. ముఫై అయిదేళ్ల లోపు జనాలంతా ఇప్పుడు జనసేన అంటూ ఊగుతున్నారు. ఇంతకు ముందు కూడా ఊగారు కదా అని ఎవరైనా అనుకోవచ్చు. అలా ఊగి మరీ ఓడించారు కదా అనీ అనొచ్చు. నిజమే. కానీ ఈసారి పల్లెల్లో కనిపిస్తున్న వాతావరణం తేడాగా వుంది.

పథకాలు అందుకుంటున్నవారంతా వైకాపా అనే అంటున్నారు. కుర్రకారు అంతా ఇప్పటి నుంచే హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడి ఫలితం తరువాత ఎలా వుంటుందో కానీ, ప్రస్తుతానికి పల్లెల్లో తెలుగుదేశం మిస్ అవుతోంది. ఇదే అసలు సిసలు సమస్య. కుర్రకారు దృష్టిలో తెలుగుదేశం మిస్ అయిపోయింది. 

వైకాపా కొంత వరకు వుండేది. అది మొన్నటి ఎన్నికల సంగతి. ఇప్పుడు అదీ మిస్ అవుతోంది. జనసేన వైపు యువత మళ్లుతోంది. రావాలి జగన్ ...కావాలి జగన్ అన్న యువతరం మనసు ఎందుకు మారింది అన్నది ప్రశాంత్ కిషోర్ టీమ్ కనిపెట్టాలి. దానికి తగిన మాత్రలు వేయాలి. అదంతా వేరే సంగతి.

మరి తెలుగుదేశం సంగతేమిటి? ఇటు పథకాల కారణంగా ఫార్టీ ప్లస్ జనాలను దూరం చేసుకుని, జనసేన కారణంగా కుర్రకారును దూరం చేసుకుంటే తెలుగుదేశం జెండా మోసేవారు ఎవరు?  తెలుగుదేశం పార్టీలో సంప్రదాయంగా వస్తున్న నాయకులు మిగిలారు. వారు అక్కడే వున్నారు. అందులో సందేహం లేదు. కానీ  జెండా మోయాల్సిన కార్యకర్తల సంఖ్య తగ్గిపోతోంది. 

పాతిక ముఫై ఏళ్ల కుర్రాళ్లకు తెలుగుదేశంతో ఏ అనుబంధం లేదు. ఏ అభిమానం వారిని పట్టి వుంచేది లేదు. కానీ ఇక్కడ పవన్ గ్లామర్, ప్లస్ ఫ్యాక్టర్ వుంది. అలాగే జగన్ మీద ఎంతొ కొంతయినా వుంది. కానీ తెలుగుదేశానికి ఆ పుల్లింగ్ మిస్ అవుతోంది. 

ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం తప్పనిసరిగా జనసేనతో పొత్తు పెట్టుకుని వెళ్లాల్సిందే. అలా కాకపోతే ఏదైనా జరగొచ్చు. తెలుగుదేశం ఓటు బ్యాంక్ మాయం కావచ్చు. జనసేనకు జవసత్వాలు రావచ్చు. లేదా ఓటు శాతం సరిపోక మళ్లీ జగన్ కు ఊతం కావచ్చు. 

ఏమైనా 2024 ఎన్నికల తెరమీద తేదేపా వుండాలి అంటే జనసేన అండ అన్నది కచ్చితంగా అవసరం. ఈ జోస్యం మరో ఏడాదిలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 

ఆర్వీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?